చంద్రబాబు కోటరీ మొత్తం ఇప్పుడు కొత్త బాధ్యతను నెత్తికెత్తుకున్నది. తెలుగు అమ్మాయి పీవీ సింధు.. అరుదైన ఘనతను సాదించి సగర్వంగా భారత్కు తిరిగి వచ్చిన వేళ.. ఈ సందర్భాన్ని తమకు అనుకూలంగా మలచుకోవడం ఎలాగా అని వారు తపన పడిపోతున్నారు. పీవీ సింధును ఒక ఎలిమెంట్ గా వాడుకుని, మాగ్జిమమ్ తాము ఎలాంటి మైలేజీ పొందగలం.. అనే తపనలో బాబు కోటరీ వ్యూహకర్తలు ఆరాటపడుతున్నారు. అయితే తమకు మంచి పేరు కంటె ఎదుటి వారి మీద బురద చల్లడానికి ఎక్కువ తహతహలాడిపోయే ఈ బృందం.. పీవీ సింధు విజయానికి ముడిపెట్టి జగన్ను విలన్గా ఎత్తిచూపించడానికి చేస్తున్న ప్రయత్నమే మరీ చవకబారుగా కనిపిస్తోంది.
చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఉన్న సమయంలో గోపీచంద్కు బ్యాడ్మింటన్ అకాడమీ కట్టుకోవడానికి అయిదు ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఈ స్థలం చాలా విలువైనది. ఆ తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. అప్పటి వరకు ప్రభుత్వం కేటాయించిన స్థలంలో.. కేటాయించిన ప్రయోజనాలకు సంబంధించి ఎలాంటి పనులు మొదలు కాకపోవడంతో.. దాన్ని ఎందుకు వెనక్కు తీసుకోకూడదు.. అని సర్కారు నోటీసులు ఇచ్చింది. అప్పటికి గోపీ చంద్ అకాడమీ పూర్తిస్థాయిలో మొదలు కాలేదు. గోపీచంద్ హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు.
అయితే చంద్రబాబు ఇచ్చిన భూమిని వైఎస్సార్ లాక్కోడానికి చూశాడని, దానికి తెరవెనుక జగన్ ఒత్తిడి కారణం అని ఇప్పుడు తెదేపా తైనాతీలు ప్రచారం చేస్తున్నారు. అప్పట్లో గోపీచంద్ భూమిని లాక్కుని ఉంటే, అకాడమీ లేకపోయి ఉంటే.. ఇవాళ ఈ పతక గౌరవం దక్కేదేనా..? అని అంటున్నారు. నాడు వైఎస్సార్ సర్కారు తలపెట్టిన ద్రోహానికి ఇవాళ జగన్ సమాధానం చెప్పాలంటున్నారు.
అయితే ఇదంతా తెదేపా భజనగాళ్ల ఆవేదనే తప్ప వాస్తవాలు మరో రకంగా ఉన్నాయి. స్థలాలను ఖాళీగా ఉంచిన క్రమంలో నిబంధనల ప్రకారం మాత్రమే గోపీచంద్కు కూడా నోటీసులు వెళ్లాయి. ఒక ప్రాసెస్ లాగా.. కోర్టు స్టే రావడం జరిగింది. అయితే ఆ తర్వాత గోపీచంద్ , నిమ్మగడ్డ ప్రసాద్ నుంచి 5 కోట్ల రూపాయల విరాళం తీసుకుని అకాడమీని పూర్తిచేశారు. అంతసొమ్ము అలా విరాళంగా ఎలా వచ్చింది?
నిజానికి వైఎస్సార్ , గోపీచంద్కు వ్యతిరేకంగా కీడు చేయదలచుకుంటే గనుక, ఆయన మాటను కాదని ,5 కోట్ల విరాళం ఇచ్చే ధైర్యం నిమ్మగడ్డ ప్రసాద్కు ఉండేదేనా? అనేది ఆలోచించాల్సిన సంగతి. కొందరి వాదన ప్రకారం అప్పట్లో నిమ్మగడ్డ ప్రసాద్, గోపీచంద్కు 5 కోట్ల విరాళం ఇవ్వడం వెనుక వైఎస్సార్ ప్రోద్బలం కూడా ఉన్నదని అంటుంటారు. అయితే ఆ వాస్తవాలని మరుగున పెట్టేస్తూ.. జగన్ , గోపీచంద్ భూములు లాక్కోవడానికి చూస్తున్నట్లుగా బాబు కోటరీ మోకాలికి బోడిగుండుకీ జగన్ విలనీకి ముడిపెట్టే ప్రయత్నం చేస్తుండడం చవకబారుగా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.