ఏపీలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది!

ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ.. మంత్రి వర్గ విస్తరణ ఏపీలో పొలిటికల్ హీట్ ను పెంచుతోంది. ఏ ప్రభుత్వంలో అయినా మంత్రి వర్గ విస్తరణ అనేది కొన్ని అసంతృప్తులకు, కొన్ని లుకలుకలకు కారణం అవుతుంది. అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో ఈ వ్యవహారం చాలా ఆసక్తితో కూడుకున్నదిగా మారింది. విస్తరణ పరిణామాలతో బాబుతో అమితుమి తేల్చుకుంటామన్నట్టుగా కొంతమంది నేతల ప్రకటనలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఏపీలో పొలిటికల్ హీట్ ను పెంచుతున్నాయి వీరి మాటలు.

‘బాబుపై చాలా నమ్మకం ఉంది..’ అని అంటున్నారు శిల్పా చక్రపాణి రెడ్డి. ‘మీరు తెలుగుదేశం పార్టీని వీడుతున్నారా?’ అనే ప్రశ్నకు ఆయన ఈ విధంగా స్పందిస్తున్నారు. బాబుపై తమకు అపారమైన విశ్వాసం ఉందని.. దాన్ని ఆయన నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నామని ఈయన అంటున్నారు. మరి ఇక్కడ సమస్యేమిటో వివరించనక్కర్లా! తమకు మంత్రి పదవిని ఆశిచడం లేదు శిల్పా సోదరులు. భూమా నాగిరెడ్డికి పదవిని ఇవ్వకూడదనేది మాత్రమే వీరి కోరిక!

అయితే.. తెలుగుదేశంలో ఇప్పుడున్న ప్రచారం ఏమిటంటే, భూమాకు చంద్రబాబు మంత్రి పదవిని ఇవ్వడం ఖాయం అని! భూమాకు పదవిని బాబు ఇవ్వడు.. అని శిల్పా వర్గం అంటోంది. ఇస్తేగిస్తే.. వీళ్ల దారి వీళ్లు చూసుకుంటారనే తెలుస్తోంది. ఈ మేరకు శిల్పా సోదరులు కేఈ కృష్ణమూర్తికి స్పష్టం చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి! 

కేవలం కర్నూలు వ్యవహారం మాత్రమే కాదు.. మంత్రి వర్గ విస్తరణ వ్యవహారం వివిధ జిల్లాల్లో రచ్చ రేపుతోంది. ఆశావహులు తమకు పదవులు వస్తాయనే లెక్క కన్నా.. ఫిరాయింపుదారులకు పదవులు దక్కితే తట్టుకోలేం..అనే సంకేతాలు పంపుతున్నారు అధినేతకు. ప్రకాశం, ఉత్తరాంధ్ర, రాయలసీమ.. ఈ ప్రాంతాల్లో అంతా ఇలాంటి రచ్చలే సాగుతున్నాయి. ఫిరాయింపుదారులకు మంత్రి పదవులను ఇస్తే సహించేది లేదని.. తెలుగుదేశం నేతలు తేల్చి చెబుతున్నారు!

బాబుకు ఈ విషయంలో బహిరంగ హెచ్చరికలే జారీ చేస్తున్నారు! మరి ఇదంతా వ్యూహాత్మకం అనే వాళ్లూ లేకపోలేదు. వైకాపా నుంచి తెచ్చుకున్న వారికి ఝలక్ ఇవ్వడంలో భాగంగా, సొంత పార్టీ నేతల చేత బాబు ఇలా మాట్లాడిస్తున్నాడని కొంతమంది అంటున్నారు. ఇదెలా ఉందంటే.. బాబు పదవులు ఇస్తాడన్నా ఎవ్వరూ నమ్మరు, ఇవ్వడు అనే మాటనూ ఎవ్వరూ విశ్వసించలేకపోతున్నారు! ఇదీ పాలిటిక్స్ లో చందన్నకు ఉన్న క్రెడిబులిటీ!

Show comments