ఆర్కేనగర్ లో విజయశాంతి హల్ చల్!

జయలలిత మరణానంతరం తమిళనాడు రాజకీయాల వైపు కన్నేసినట్టుగా కనిపిస్తున్న విజయశాంతి ఆర్కేనగర్ లో ప్రత్యక్షం అయ్యారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారామె. ఇంతకీ ఎవరిని గెలిపించడానికి అంటే.. అది టీటీవీ దినకరన్ కోసం. అన్నాడీఎంకే శశికళ వర్గం తరపున టోపీ గుర్తుపై పోటీ చేస్తున్న దినకరన్ ను ఆర్కేనగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిపించాలని విజయశాంతి ప్రచారం చేస్తున్నారు.

శశికళ అక్క కొడుకు తరపున ప్రచారం చేస్తోంది ఈ మాజీ హీరోయిన్. తమిళంలో మాట్లాడేస్తూ.. విజయశాంతి ఆర్కే నగర్ ఓటర్లను ఆకట్టుకోవడానికి ఈమె ప్రయత్నిస్తోంది. రెండ్రోజుల కిందట ఆర్కేనగర్ లో దినకరన్ కు తమిళ స్టార్ హీరో శరత్ కుమార్ మద్దతు ప్రకటించగా.. ఇప్పుడు విజయశాంతి రంగంలోకి దిగింది. ఈ విధంగా తమకు ఉన్న అన్ని మార్గాలనూ ఉపయోగించుకుని ఆర్కేనగర్ పరిధిలో కార్యకర్తలను ఉత్సాహ పరచడానికి దినకరన్ ప్రయత్నిస్తున్నట్టుగా ఉన్నాడు.

అయితే తమిళ తంబీలకు విజయశాంతి ఇప్పటి వరకూ గుర్తుందా అనేదే ఇక్కడ సందేహం. చివరగా ఎప్పుడో పదిపదిహేనేళ్ల కిందట విజయశాంతి తమిళ సినిమాల్లో నటించినట్టుంది.  ఆ తర్వాత రాజకీయాలతో బిజీ అయిపోయిన ఈమె ఎంపీగా పని చేసింది, టీఆర్ఎస్ లో ఒకదశలో వెలుగు వెలిగింది. ఆ తర్వాత రాత తిరగబడి ఎవరికీ కాకుండా పోయింది.

జయలలిత మరణానంతరం శశికళను కలిసింది విజయశాంతి. కేవలం సానుభూతిని తెలియజేసేందుకే విజయశాంతి తమిళనాడుకు వెళ్లిందని అనుకున్నారు. అయితే ఇప్పుడు ప్రచారంతో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోందీమె. మరి శరత్ కుమార్, విజయశాంతి వంటి వాళ్ల ప్రచారం పుణ్యం ఎంత వరకూ ఫలితం ఇస్తుందో.. దినకరన్ ను ఏ మేరకు గెలిపిస్తుందో!

Show comments