పూరితో సినిమా పక్కా-వెంకీ

దర్శకుడు పూరిజగన్నాధ్ తో సినిమా చేయబోతున్న విషయాన్ని విక్టరీ వెంకటేష్ కన్ ఫర్మ్ చేసారు. గురు సినిమా ప్రచారంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, తనకోసం పూరి ఓ కథ రెడీ చేస్తున్నారని వెల్లడించారు. అదే సందర్భంగా క్రిష్ తో ఓ నవలా చిత్రం చేద్దామనుకున్నా, కుదరలేదనీ చెప్పేసారు. 

కొన్నాళ్ల క్రితం వెంకీకి పూరిజగన్నాధ్ లైన్ చెప్పాడని, అయితే పూర్తి కథ చెప్పకపోవడం వల్ల ఆ వ్యవహారం అక్కడితో ఆగిపోయిందని వార్తలు వెలువడ్డాయి. అయితే ఇప్పుడు వెంకీ చెప్పిన దాన్ని బట్టి, అది ఆ ప్రాజెక్టు వుందని స్పష్టమవుతోంది. లైన్ చెప్పి, సెట్ మీదకు వెళ్లి కథ డెవలప్ చేసే అలవాటు వున్న పూరిజగన్నాధ్ ఇప్పుడు వెంకీ కోసం కథ రెడీ చేస్తున్నారన్నమాట.

ఇదిలా వుంటే వెంకీ బాలీవుడ్ లో వున్న ఓ తెలుగు దర్శకుడితో కూడా కథా చర్చలు సాగిస్తున్నారు. తెలుగు కుర్రాడే, బాలీవుడ్ లో వుంటూ, దర్శకత్వం అవకాశం కోసం చూస్తున్నట్లు వినికిడి. అతను నిర్మాత అశ్వనీదత్ కు చెప్పిన లైన్ బాగుందని తెలియడంతో, వెంకీ ముంబాయి నుంచి రప్పించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ కథపై డిస్కషన్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది

Show comments