చంద్రబాబు త్యాగానికి పీతల కితాబులు!!

చంద్రబాబునాయుడు ఓ త్యాగమూర్తి ధధీచి అనుకోవాల్సిందే.. ఆయన కేబినెట్ లోని మంత్రి పీతల సుజాత తాజాగా చెబుతున్న మాటలు వింటే అలాగే అనిపిస్తుంది! మెడమీద కత్తి వేలాడుతున్న మంత్రులు తమ తమ పదవుల్ని కాపాడుకోవడానికి అధినేతను ప్రసన్నం చేసుకునేలా ఆయనకు భజన చేస్తూ ప్రకటనలు గుప్పించడం కొత్త విషయం కాదు. అయితే.. అలాంటి భజన పర్వంలో భాగంగా మంత్రి పీతల సుజాత చెబుతున్న సంగతే విన్నవారికి కితకితలు పెడుతోంది. చంద్రబాబు నాయుడు ఎంతటి మహనీయుడో, ఎంతటి త్యాగమూర్తో.. పీతల సుజాత అభివర్ణిస్తోంటే.. అప్పటి రాజకీయ నేపథ్యం తెలిసిన వారు.. విచ్చలవిడిగా నవ్వుకుంటున్నారు.

వివరాల్లోకి వెళితే.. విజయవాడలో మహిళా పార్లమెంటేరియన్ సదస్సు సందర్భంగా.. తనకు జరిగిన అవమానం, తనను నిర్బంధించడంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో తాజాగానూ ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయపోరాటం చేస్తానంటూ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సహజంగానే తెలుగుదేశం నుంచి కౌంటర్లు కూడా వచ్చాయి. ఈ బాధ్యత తీసుకున్న పీతల సుజాత , రోజాను దెప్పి పొడుస్తూ.. చంద్రబాబునాయుడు మీద ఆమె ఏం న్యాయపోరాటం చేస్తారు. చంద్రగిరి నియోజకవర్గంలో తన సొంత తమ్ముడిని పక్కన పెట్టి ఆమెకు పార్టీ టిక్కెట్ ఇచ్చినందుకు న్యాయపోరాటం చేస్తారా? అంటూ చంద్రబాబు చేసిన త్యాగాన్ని నెత్తికెత్తుకున్నారు. 

కానీ ఆ ఎన్నికల సమయం నాటి వాస్తవ పరిస్థితులు తెలిసిన వారికెవరికైనా ఆమె స్టేట్మెంట్ చిరాకు తెప్పిస్తుందనడంలో సందేహం లేదు. చంద్రబాబునాయుడు  హామీ మేరకు తెలుగుదేశం పార్టీలో అప్పట్లో కీలకంగా ఉన్న రోజా.. చిత్తూరు జిల్లాలో నగరి నియోజకవర్గంలో సుదీర్ఘకాలం కష్టపడి పనిచేసి.. తనకంటూ ప్రజాబలాన్ని సృష్టించుకున్నారు. అయితే నియోజకవర్గాల సర్దుబాటులో పుత్తూరు సెగ్మంటు ఎగిరిపోవడంతో.. గాలి ముద్దుకృష్ణమనాయుడుకు గత్యంతరం లేక నగరికి వెళ్లాలని పట్టుపట్టడంతో.. చంద్రబాబునాయుడు , రోజాకు అన్యాయం చేశారు. అన్నేళ్లుగా ఆమె ప్రజాబలం పెంచుకున్న నగరి నియోజకవర్గాన్ని ఆమెకు ఇవ్వకుండా అన్యాయం చేశారు. పైగా అప్పటికి చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు కు టిక్కెట్ ఇస్తే పార్టీ పరిస్థితి సర్వనాశనమే అన్నట్లుగా అప్పటి నివేదికలు చెబుతున్నాయి. పైగా గల్లా అరుణకు అది బలమైన నియోజకవర్గంగా అప్పటికి ఉంది. రోజాకు నగరి ఇవ్వకుండా , ఏదో కంటితుడుపు కింద, ఆమె వద్దంటున్నా వినకుండా చంద్రగిరి టిక్కెట్ ను ఆమె నెత్తిన రుద్దారు. 

అయితే ఇవాళ.. చంద్రబాబునాయుడు తన తమ్ముడికి ఇవ్వాల్సిన టిక్కెట్ ను అపూర్వమైన త్యాగం చేసి మరి రోజాకు ఇచ్చినట్లుగా ఈ ఎపిసోడ్ గురించి మంత్రి పీతల సుజాత అభివర్ణిస్తోంటే.. ఆమెకు వాస్తవాలు తెలియవని అనుకోవాలా? లేదా, ప్రజలకు తెలియదు లెమ్మని ఆమె అవాకులూ చెవాకులూ పేలుతోందని అనుకోవాలా? అని జనం విస్తుపోతున్నారు. 

Show comments