ఫొటో అదిరింది.. సినిమా ఏమయ్యింది.!

ఎన్నాళ్ళకెన్నాళ్ళకు.? పవన్‌కళ్యాణ్‌కి సంబంధించి ఓ సినీ విశేషం బయటకు వచ్చింది. పూర్తిగా సినీ విశేషం కాకపోయినా, పవన్‌కళ్యాణ్‌తో కొత్త సినిమాకి సిద్ధమైన నిర్మాత శరద్‌ మరార్‌, పవన్‌కళ్యాణ్‌ ఫొటోని సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేయడమంటే సినీ విశేషంగానే భావించాలేమో.! 

కొన్నాళ్ళ క్రితం ఎస్‌జె సూర్యతో పవన్‌కళ్యాణ్‌ హీరోగా సినిమా లాంఛనంగా ప్రారంభమయ్యింది.. ఇటీవలే అది అటకెక్కింది. ఎస్‌జె సూర్య స్థానంలోకి 'గోపాల గోపాల' ఫేం డాలీ వచ్చాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా 'పక్కా' అనుకున్నారంతా. కానీ, అదీ అయోమయంలోకి వెళ్ళింది. రేసులో త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ పేరు విన్పించింది. కాదు కాదు, సంపత్‌ నందిని పిలిచాడట, హరీష్‌ శంకర్‌ని అడిగాడట.. అంటూ పవన్‌ గురించి కుప్పలు తెప్పలుగా గాసిప్స్‌ వచ్చాయి. 

అసలు పవన్‌, తదుపరి సినిమా చేస్తాడా లేదా.? అన్నది సస్పెన్స్‌గా మారిన తరుణంలో, నిర్మాత శరద్‌ మరార్‌.. పవన్‌తో సినిమా విశేషాల్ని ముచ్చటించేందుకు ఫామ్‌ హౌస్‌కి వెళితే, ఇదిగో ఇలా పవన్‌కళ్యాణ్‌ దర్శనమిచ్చాడంటూ ఫొటోని సోషల్‌ మీడియాలో పెట్టాడు. ఫొటో అదిరిందంటూ అభిమానులు సంబరం చేసుకుంటున్నారు సరేగానీ, ఇంతకీ సినిమా ఏమయ్యిందట.? నిర్మాత శరద్‌ మరార్‌ కూడా క్లారిటీ ఇవ్వకపోతే, ఈ సినిమా గురించి ఎవరు స్పష్టతనివ్వగలరు.?

Show comments