చంద్ర శేఖర్ యేలేటి..వైవిధ్యం కోసం తపించే దర్శకుల్లో ఒకరు. ఐతే నుంచి సాహసం వరకు ఆయన చేసినవన్నీ ఒకదానితో మరొకటి పోలిక లేనివే. ఆయన అందిస్తున్న లేటెస్ట్ మూవీ..మనమంతా.. ఈ సినిమాకు ఇంకా చాలా ప్రత్యేకతలు వున్నాయి. మోహన్ లాల్ తొలిసారిగా తెలుగులో పూర్తి నిడివి పాత్ర పోషిస్తున్న చిత్రం ఇది.
అంతే కాదు..తెలుగు అమ్మాయి గౌతమి చాలా కాలం తరువాత మళ్లీ తెలుగు తెరపై నటిస్తున్న సినిమా. ఈ సినిమా కోసం మోహన్ లాల్ స్వయంగా తెలుగులో డబ్బింగ్ కూడా చెప్పారు. ఇక ఈ సినిమా వన్ మినిట్ టీజర్ ఈరోజు విడుదల చేసారు. స్టోరీ లైన్ ను స్మూత్ గా చెప్పే ప్రయత్నం చేసారు దర్శకుడు.
ఓ మధ్యతరగతి కుటుంబపు ఆశలు, కోరికలు, వాటి పర్యవసానాలు, ఇంటి పెద్ద బాధ్యతలు.. బాధలు.. అడ్జస్ట్ మెంట్లు, ఒకటి రెండు డైలాగులు, మహేష్ శంకర్ నేపథ్య సంగీతం తోడుగా వన్ మినిట్ లోనే కళ్లకు కట్టేసాడు దర్శకుడు. నిర్మాత సాయి కొర్రపాటికి కమర్షియల్ సినిమాల కన్నా మంచి సినిమాలు అందించాలనే తాపత్రయం ఎక్కువ. ఈ టీజర్ లో కూడా అదే కనిపిస్తోంది.