హైదరాబాద్ బంజారా హిల్స్లో వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని అక్రమంగా కొల్లకొడదామని ప్లాన్ వేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన టీడీపీ ఎమ్మెల్సీ దీపక్రెడ్డిని బయటపడేసేందుకు మేనమామ జేసీ దివాకర్రెడ్డి రంగంలోకి దిగారు.
మేనల్లుడు అరెస్ట్తో హతాశుడైన జేసీ ఎలాగైనా దీపక్రెడ్డిని విడిపించాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగా చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడిన జేసీ నేరుగా కలుస్తానని కోరగా బాబు అపాయింట్మెంట్ తిరష్కరించినట్టు తెలుస్తోంది.
గత ఎన్నికల్లో కుటుంబ ప్యాకేజీ ఒప్పందంతో తెలుగుదేశంలో చేరిన జేసీ తనకు అనంతపురం ఎంపీ సీటు తోపాటుగా తమ్ముడు ప్రభాకర్రెడ్డికి తాడిపత్రి ఎమ్మెల్యే టికెట్, మేనల్లుడు దీపక్రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇప్పించుకున్నాడు. 2012 రాయదుర్గం ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన దీపక్రెడ్డి వైసీపీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి చేతిలో ఓడిపోయాడు.
ఆది నుంచి అక్రమాలు, అవినీతికి ఆలవాలమైన దీపక్రెడ్డిపై ఇప్పటికే అటు అనంతపురం, ఇటు హైదరాబాద్లో గంపెడు కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ప్రభుత్వ జాగా కాజేద్దామనుకుని హైదరాబాద్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. సాక్షాలు, ఆధారాలతో సహా దీపక్రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి చంచల్గూడ జైలుకు తరలించారు.
అయితే మేనల్లుడు కష్టాలు చూసి మనోవేదన చెందిన జేసీ బ్రదర్స్ దీపక్రెడ్డిని విడిపించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు చంద్రబాబుతోపాటు అటు తమ పాత మిత్రులైన తెలంగాణ కాంగ్రెస్ నేతలను కూడా ఈ విషయంపై జేసీ దివాకర్రెడ్డి సహాయం అర్థించినట్టు తెలుస్తోంది. అయితే కొంత కాలంగా హైదరాబాద్లో బయటపడుతున్న భూ కబ్జాలపై ఉక్కుపాదం మోపుతున్న కేసీఆర్ సర్కారు దీపక్రెడ్డి కబ్జాను సీరియస్గా తీసుకుని ఆయన్ని పక్కా ఆదారాలతో అరెస్ట్ చేసింది.
తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వమే కబ్జాదారులని ప్రోత్సహిస్తోందని కేసీఆర్ పై ఆరోపణలు చేస్తున్న టీ కాంగ్రెస్ నేతలు ఇప్పడు దీపక్రెడ్డి విషయంలో జేసీకి సహాయం చేసేందుకు ముందుకు రావడం లేదట. మరోవైపు చంద్రబాబు కూడా దీపక్రెడ్డి విషయంలో పూసుకోకూడదని నిర్ణయించుకున్నట్టు సమాచారం. అసలే ఓటుకు నోటుతో కేసీఆర్తో వైరం తెచ్చుకున్న బాబు ఇప్పడీ భూ కబ్జా కేసుల్లో వేలు పెట్టి కొత్త తలనొప్పులు తెచ్చుకోడని టీడీపీ నేతలు చెప్తున్నారు.
మరోవైపు దీపక్రెడ్డిపై ఉన్న పాత కేసులను కూడా తవ్వి మరింత ఇబ్బంది పెట్టి తద్వారా ఆంధ్రా, రాయలసీమ నేతలకు గట్టి గుణపాఠం చెప్పాలనీ కేసీఆర్ సర్కారు భావిస్తోంది. ఈ మేరకు పోలీసు శాఖకు ఆదేశాలు జారీ చేసింది. భవిష్యత్తులో పక్క రాష్ట్ర నేతలెవ్వరూ హైదరాబాద్, తెలంగాణలో భూ కబ్జాలకు పాల్పడాలంటేనే వణికిపోవాలని, అందుకు దీపక్రెడ్డి ఊదాహరణగా చుపలనట్టు కేసీఆర్ వ్యవహరిస్తున్నారు.