చినబాబు నారా లోకేష్కి మంత్రివర్గంలో చోటు కల్పించడానికి ఎట్టకేలకు టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. 'లోకేష్ని మంత్రివర్గంలోకి తీసుకుంటున్నాం..' అని పార్టీ నేతలకు చంద్రబాబు సమాచారమిచ్చారట. నిజానికి, చంద్రబాబుపై లోకేష్ ఒత్తిడి ఈనాటిది కాదు. చాలాకాలంగా తెరవెనుక 'రచ్చ' జరుగుతోంది. పార్టీ నేతలతో చెప్పించారు.. మంత్రులతో చెప్పించారు.. ఏం చేసినా, చినబాబు కోరిక మాత్రం తీరలేదు. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకున్న 'రాజకీయ ప్రకంపనల' నేపథ్యంలో, ఇక ఇలా కాదనుకుని చంద్రబాబు.. తన పుత్రరత్నం కోరికను తీర్చడానికి సమాయత్తమయినట్లున్నారు.
సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్కి ఝలక్ ఇచ్చినట్లు, తనకూ తన పుత్ర రత్నం షాక్ ఇస్తారేమోనని చంద్రబాబుఏ భయపడ్డారేమో.! కారణాలేవైతేనేం, లోకేష్ త్వరలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో చేరబోతున్నారన్నమాట. ఇప్పటిదాకా, తెరవెనుక అవినీతి.. ఇకపై, అధికారిక అవినీతి.. అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. లోకేష్, చంద్రబాబు మంత్రివర్గంలో చేరనుండడం గురించి. ఎవరేమనుకుంటేనేం, చంద్రబాబు అవినీతి ఆరోపణల్ని అసలేమాత్రం పట్టించుకోరు కదా.!
ఇంతకీ, చినబాబు పట్టాభిషేకమెప్పుడట.? అతి త్వరలోనే. ఆ అతి త్వరలో ఎప్పుడన్నది ప్రస్తుతానికైతే సస్పెన్సే. చినబాబు పట్టాభిషేకమంటే, కొంతమంది మంత్రులకు షాక్లు కూడా తప్పవు. లిస్ట్లో ముందున్న పేరు రావెల కిషోర్. ఈ మధ్యనే, ఆయనకు చంద్రబాబు షాక్ల మీద షాకులిచ్చారు. చంద్రబాబు ఇచ్చిన గట్టి వార్నింగ్తో కొన్నాళ్ళపాటు రావెల కిషోర్, మీడియా ముందుకొచ్చేందుకూ మొహమాట పడ్డార్లెండి.
చినబాబు, మంత్రివర్గంలో చేరడం సంగతెలా వున్నా, తమ పదవులు ఊడిపోతాయన్న ఆందోళనలో కొందరు మంత్రులున్నారట. మంత్రుల ఆందోళన, చినికి చినికి గాలి వానలా తయారయ్యే అవకాశాలున్నాయి. పార్టీ ఫిరాయించిన నేతల్లో కొందరికైనా మంత్రి పదవులు ఇవ్వాల్సి వస్తుందనే కోణంలో ఇప్పటిదాకా మంత్రి వర్గాన్ని ఏమాత్రం కదిలించని చంద్రబాబుకి.. ఇప్పుడు కదలించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆ కదలిక, టీడీపీలో రాజకీయ ప్రకంపనలకు కారణమవుతుందన్నది నిర్వివాదాంశం.