సాయి పల్లవికి సింగిల్ పేమెంట్

దిల్ రాజు ప్లానింగ్ ఇది. మలయాళంలో మంచి పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మను ఫిదా సినిమాతో తెలుగు తెరకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు నిర్మాత దిల్ రాజు. అయితే కేవలం ఈ ఒక్క సినిమాకు మాత్రమే ఆమెను పరిమితం చేయడం లేదు. పరిశ్రమకు తీసుకొస్తూనే ఏకంగా 3 సినిమాలకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారట. ఆ 3 సినిమాలకు సంబంధించి ఒకేసారి సింగిల్ పేమెంట్ ఇచ్చారట.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఫిదా సినిమా చేసింది సాయి పల్లవి. ప్రస్తుతం అదే బ్యానర్ పై నాని హీరోగా తెరకెక్కుతున్న ఎంసీఏ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించబోతోంది. ఈ రెండు సినిమాలతో పాటు త్వరలోనే దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కనున్న మరో సినిమాలో కూడా ఆమె కనిపించనుంది. ఇలా దిల్ రాజుకు 3 సినిమాలు రాసిచ్చేసింది సాయి పల్లవి.

అయితే ఆ మూడో సినిమా ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్. దిల్ రాజు కోటరీలో సతీష్ వేగేశ్న, శ్రీకాంత్ అడ్డాల, దశరథ్ స్క్రిప్టులతో రెడీగా ఉన్నారు. వీళ్లలో సతీష్ వేగేశ్న సినిమాకు టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమాలోనే సాయి పల్లవి హీరోయిన్ గా నటించే అవకాశముంది.

Show comments