కొత్తగండం: కబాలిని విడుదల చేయనివ్వొద్దు!

కబాలి కోసం అంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తమిళనాడులో కొన్ని కంపెనీలు సెలవు ప్రకటించి మరీ రెడీ అయ్యాయి. ఇక ఇప్పటికే కబాలి టికెట్లను సంపాదించిన అభిమానులు  ఫేస్ బుక్ లో ఆ టికెట్ల ఫొటోలు పెడుతూ ఆనందిస్తున్నారు. అత్యంత భారీ అంచనాలతో.. ప్రపంచ వ్యాప్తంగా రజనీ అభిమానులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇక లీకేజీ వార్తలతో సహా రకరకాల వ్యవహారాలతో కబాలి హాట్ టాపిక్ గా మారింది. అందరి దృష్టి రజనీ సినిమా మీదే నిలిచిన ఈ సందర్భంలో.. మరి కొన్ని గంటల్లో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో… ఈ సినిమాకు కొత్త గండం చుట్టకుంది!

ఈ సినిమా విడుదలను ఆపాలని చెన్నై హై కోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. ఏదో హాస్యాస్పదమైన కారణంతో గాక.. ఇది వరకూ రజనీ సినిమాను పంపిణీ చేసిన ఒక డిస్ట్రిబ్యూటర్ ఈ మేరకు కోర్టకు ఎక్కాడు. ‘లింగా’ సినిమా పంపిణీని చేసి నష్టపోయిన తనకు రూ.89 లక్షల రూపాయలు ఇస్తానని రజనీకాంత్, ఆ సినిమా నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ లు పేర్కొన్నారని.. అయితే ఇంత వరకూ ఆ సొమ్ము చెల్లించలేదని.. ఆ డబ్బు చెల్లించే వరకూ రజనీ తాజా సినిమా విడుదలను ఆపాలని ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేసుకున్నాడు.

ఈ పిటిషన్ ను కోర్టు విచారణకు స్వీకరించింది. రజనీకాంత్ తో పాటు , కబాలి నిర్మాత థానుకు నోటీసులు జారీ చేసింది న్యాయస్థానం. మరి కొన్ని గంటల్లో విడుదల కానున్న ఈ సినిమా విషయంలో ఇలాంటి పిటిషన్ అభిమానుల్లో గుబులు రేపుతున్న అంశమే. గురువారమే ఈ పిటిషన్ పై విచారణ చేపట్టనుంది కోర్టు. ఈ వివాదం పరిష్కారం అయ్యే దాని మీదే రేపు కబాలి విడుదల ఆధారపడి ఉంది. ‘కబాలి’ మంచి ఊపు మీద ఉన్న ‘లింగా’ పీడ వదలడం లేదు. ఏం జరుగుతుందో!

Show comments