అరవింద్‌ స్వామీ.. ఇది నీకు న్యాయమా.?

'జనతా గ్యారేజ్‌' సినిమాలో మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ నటించడం, ఆ సినిమాకి అతని స్టార్‌డమ్‌ ఎంతగానో ఉపయోగపడ్డం తెల్సిన విషయమే. మలయాళంలోనూ ఈ సినిమాకి మంచి క్రేజ్‌ వచ్చిందంటే దానికి కారణం కేవలం మోహన్‌లాల్‌ అని చెప్పక తప్పదు. ఈ తరహా కాంబినేషన్లు సినిమా రేంజ్‌ని పెంచుతాయన్నది నిర్వివాదాంశం. 

అలాగే, 'ధృవ' విషయంలో కూడా జరిగింది. భారీగా ఖర్చు చేసి మరీ అరవింద్‌ స్వామిని తెలుగులోకి తీసుకొచ్చారు. అలా తీసుకురావడం 'ధృవ'కి కలిసొచ్చింది కూడా. ఇంకేముంది, వరుసగా అరవింద్‌ స్వామి తెలుగులో నటిస్తాడని అంతా అనుకుంటే, 'అబ్బే, ఇకపై తెలుగులో నటించను' అని తేల్చేసి పెద్ద షాకే ఇచ్చాడు. అతను చెయ్యనన్నాడుగానీ, తెలుగు సినీ జనం ఊరుకుంటారా.? అరవింద్‌స్వామి వెంటపడ్తున్నారు. దాంతో, ఇంకా బెట్టు చేసేస్తున్నాడు. 

ఇదంతా, తన డిమాండ్‌ని పెంచుకోవడానికి అరవింద్‌ స్వామి 'ప్లే' చేస్తున్న 'మైండ్‌ గేమ్‌' అని చెప్పక తప్పదు. టాలీవుడ్‌కి చెందిన ఓ ప్రముఖ నిర్మాత అరవింద్‌ స్వామి కోజం తాజాగా ప్రయత్నిస్తే, సింపుల్‌గా సారీ చెప్పేసిన అరవింద్‌ స్వామి, తన మేనేజర్‌తో 'రెమ్యునరేషన్‌'పై పంపిన లీకేజీ చూసి సదరు నిర్మాత షాక్‌కి గురయ్యాడట. ఆ 'ఫిగర్‌' ఎంత.? అన్నదానిపై టాలీవుడ్‌లో రకరకాల గాసిప్స్‌ వినిపిస్తున్నాయి. మోహన్‌లాల్‌ విషయంలోనూ ఈ తరహా గుసగుసలు విన్పించాయనుకోండి.. అది వేరే విషయం. 'తని ఒరువన్‌' ('ధృవ'కి ఒరిజినల్‌) సక్సెస్‌తో తమిళంలో అరవింద్‌ స్వామి రేంజ్‌ పెరిగిపోయింది. 

ఓ వైపు విలన్‌ వేషాలు, ఇంకో వైపు హీరోతో సమానంగా వుండే అతి ముఖ్యమైన పాత్రల్ని మాత్రమే అరవింద్‌ స్వామి ఒప్పుకుంటున్నాడట. అక్కడ కూడా అరవింద్‌ స్వామి చెప్పే రెమ్యునరేషన్‌కి అక్కడి నిర్మాతలూ షాక్‌కి గురవ్వాల్సి వస్తోంది. దాంతో, అరవింద్‌ స్వామి బాగా 'ఎక్స్‌పెన్సివ్‌' అనే వాదన బలంగా నాటుకుపోయింది.

Show comments