మరో నిర్మాత నుంచి అడ్వాన్స్ తీసుకున్న పవన్

పవన్ చేతిలో ఇప్పటికే 3 సినిమాలున్నాయి. ప్రస్తుతం కాటమరాయుడు సినిమా షూటింగ్ ను ఫినిషింగ్ స్టేజ్ కు తీసుకొచ్చిన పవన్... త్వరలోనే త్రివిక్రమ్ మూవీని సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు. ఆ వెంటనే నేసన్ దర్శకత్వంలో సినిమాను కూడా స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడీ 3 సినిమాలు కాకుండా కొత్తగా ఇంకో సినిమా కూడా ప్రకటించే ఆలోచనలో ఉన్నాడట పవన్. ఈ మేరకు ఓ నిర్మాణ సంస్థ నుంచి అడ్వాన్స్ కూడా తీసుకున్నాడట. 

వరుసగా హిట్ చిత్రాలు నిర్మిస్తూ వస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో పవన్ కల్యాణ్ ఓ సినిమా చేసే ఛాన్స్ ఉంది. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ లాంటి హిట్ చిత్రాలతో ఊపుమీదున్న ఈ సంస్థ ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమాను నిర్మిస్తోంది. త్వరలోనే పవన్ కల్యాణ్ తో ఓ భారీ బడ్జెట్ సినిమా చేస్తుందట. అయితే ఈ ప్రాజెక్టుకు దర్శకుడు ఎవరనే విషయం మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. 

త్రివిక్రమ్ సినిమా కంప్లీట్ చేసిన తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై పవన్ చేయబోయే సినిమా డీటెయిల్స్ తెలుస్తాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీని బరిలోకి దించి, పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడు పవన్. ఈలోగా వీలైనన్ని ఎక్కువ సినిమాల్లో నటించాలని ఫిక్స్ అయ్యాడు. ఇందులో భాగంగానే కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 3 సినిమాలు ఎనౌన్స్ చేసి, వాటిని కంప్లీట్ చేసే పనిలో పడ్డాడు. ఈ 3 సినిమాలతో పాటు ఎన్నికల్లోపు మరిన్ని సినిమాలు చేయాలనేది పవన్ టార్గెట్.

Show comments