ఏపీలో టీటీడీ ప్రభుత్వ తీరు చూస్తుంటే ఇది గవర్నమెంటా లేకపోతే ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీయా అని సందేహించాల్సిన పరిస్థితి. సీఈవో చంద్రబాబు సారధ్యంలో సర్కారు వేడుకలు, ఉత్సవాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీగా మారిపోయింది. ప్రతి దానికి పండగ..కోట్ల రూపాయల ప్రజాధనం దండగ. ఏ చిన్న సందర్భాన్నీ కూడా వదలకుండా ప్రచారం చేసుకోవడం.. అసలేమీ లేని దానిక్కూడా ఏదో జరగిపోతోందని బిల్లప్ కొట్టడం.. ఇది చంద్రబాబు మార్కు స్టైల్ పాలన.. అమరావతి శంకుస్థాపన పేరుతో సింగపూర్ను తలదన్నే నగరం అని బోలెడు డబ్బు ఖర్చుపెట్టి బ్రహ్మాండమైన కార్యక్రమం చేశాడు..దేశ, విదేశాల నుంచి అతిథులను ఆహ్వానించి వారికి హైలెవెల్ ఆతిధ్యం కల్పించేందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు.. మంచిదే రాష్ట్ర రాజధాని నిర్మాణం కదా అంత హైప్ ఉండాలనుకున్నాం.. తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ నిర్మాణ శంకుస్థాపన అని మళ్లీ ఒక పండగ చేశాడు.
ఈసారి అంతే స్థాయిలో డబ్బు ఖర్చు... పూర్వికులకు పిండాలు పెట్టుకునే పుష్కరాలను ప్రభుత్వ ఉత్సవాలుగా ప్రకటించి దాదాపు 10వేలకోట్లు ఖర్చు చేశాడు.. పుష్కర ఘాట్లకు దారితీసే ప్రతి మార్గంలో హోర్డింగ్లు, ప్రచార మాధ్యమాల్లో ప్రకటనలతో ప్రజాధనం గంగపాలు చేశాడు.. సరే 12 ఏళ్లకు ఒకసారి వచ్చే సందర్భం కదా అని సర్దిచెప్పుకున్నాం. ఇప్పడు మళ్లీ రాజధాని ప్రాంతంలో ఇంకో పండగ మొదలెట్టాడు. ఏంటయ్యా అంటే క్యాపిటల్లో స్టార్టప్ కంపెనీల కోసం నిర్మిస్తున్న ప్రాంతానికి శంకుస్థాపన అట... అది కూడా ఘనంగా, వైభవోపేతంగా... మళ్లీ ప్రజాధనం మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు.. విచ్చలవిడి అధికార దర్పం.. శంకుస్థాపన వేదిక ప్రాంగణానికి రెండు ప్రత్యేక హెలికాప్టర్లలో బాబుగారు, సింగపూర్ మంత్రిగారు విచ్చేశారు... అదికాక వేడుక హాజరయ్యే అతిధుల కోసం అద్దెకు లగ్జరీ కార్లు... కార్యక్రమానికి భారీగా జనాల్ని తరలించేందుకు ఆర్టీసీ బస్సులు, ప్రయివేటు వాహనాలు... ఇంతా చేసి ఈ రోజు అక్కడ జరిగిన కార్యక్రమం ఏమిటంటే అంకుర సంస్థల ఏర్పాటుకు అనుకూలంగా భవనాలు నిర్మించేందుకు సింగపూర్ కంపెనీకి 1600 ఎకరాల రాజధాని భూముల అప్పగింత.
ఆ నిర్మాణాలు పూర్తవగానే తమ కంపెనీలను అక్కడ ప్రారంభిస్తామని కొందరితో కుదుర్చుకున్న ఒప్పంద పత్రాలను పరస్పరం మార్చుకోవడం..ఈ పత్రాలు మార్చుకునే పని ఆల్రెడీ విజయవాడలోని గేట్వే హోటల్ లోనే అయిపోయింది.. మరి ఇంతోటి దానికి ఇన్ని కోట్లు ఖర్చుపెట్టి హంగులు, ఆర్భాటాలు ఎందుకు?.. ఎందుకంటే ప్రచార పిచ్చి... ప్రతి చిన్న కార్యక్రమానికి భారీ సభలు ఏర్పాటు చేయడం... నోట్లు పంచి జనాన్ని తరలించడం... సింగపూర్లోని బాబు గారి బినామీలను వాటికి ఆహ్వానించడం... ఇక అక్కడ చంద్రబాబు విజన్ను సింగపూర్ మంత్రులూ.. సింగపూర్ గొప్పతనాన్ని చంద్రబాబు పరస్పరం పొగడ్తల్లో ముంచెత్తడం...తెల్లారి పత్రికలు, వార్తా చానళ్లలో సింగపూర్, షాంఘై నగరాలను తలదన్నే గ్రాఫిక్ డిజైన్లను చూపిస్తూ రాష్ట్ర ప్రజల్లో పెద్ద పెద్ద పూలు పెట్టడం... ఇదీ వరస.
ఏం చేస్తాం.. కానివ్వండి.. ప్రజలు అదను కోసం ఎదురుచూస్తున్నారని గ్రహించి ఇప్పటికైనా చంద్రబాబు ఈ ప్రచార పిచ్చిని తగ్గించుకోవాలి... అన్నట్టు అసలే ఎండలు మండిపోతున్నాయి కదా... వేడుకలకు హాజరైన ప్రజలకు హెరిటేజ్ మజ్జిగ కూడా పంచారట.. మరి దానికెంత బడ్జెట్ కేటాయించారో తెలియదు.