కేసీఆర్ తన రాజకీయ అనుభవాన్ని రంగరించి పన్నిన ప్లాన్లో , 'ఆపరేషన్ రేవంత్' లో ఇరుక్కుని.. తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి ఎలా విలవిల్లాడిపోయి, జైలు పాలయ్యాడో అందరికీ తెలుసు. కేసీఆర్ మార్కు డిటెక్టివ్ వ్యవహారంతో ఆ రోజుల్లో.. రేవంత్ రెడ్డి ఎంతో రహస్యంగా నడిపిన వ్యవహారం రచ్చకెక్కింది. అయితే ఇప్పుడు కేసీఆర్ సర్కారు మీద రేవంత్ రెడ్డి కూడా డిటెక్టివ్ లను పెట్టి ఉన్నాడా? కేసీఆర్ పాలనలో జరుగుతున్న రహస్యాలను చేజిక్కించుకుంటూ ఉన్నాడా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు ముమ్మరంగా జలయజ్ఞం పనులు చేపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రతిపక్షాలు విపరీతమైన అసహనంతో వేగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా ఈ విషయంలో స్పందిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వారి జలదృశ్యం ప్రదర్శన కూడా ఇలాంటి ప్రయత్నంలో భాగంగా జరిగినదే. అయితే తెదేపా విషయానికి వచ్చేసరికి.. ప్రాజెక్టులు వాటి డిజైన్ వల్ల జనానికి నష్టమా లాభమా అనే సాంకేతిక అంశాలను వారు పట్టించుకుంటున్నట్లు లేదు.
కేవలం పనులు జరుగుతున్నాయి గనుక.. ప్రభుత్వం అవినీతికి పాల్పడుతున్నది అని బురద చల్లడం ఒక్కటే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఈ పనుల టెండర్లు ఎవరికి దక్కాయో అధికారికంగా ప్రకటించకముందే.. ఎవరికి దక్కనున్నాయో తాను చెప్పగలనని రేవంత్ రెడ్డి సవాలు విసురుతున్నారు.
ఇది ప్రభుత్వ అవినీతికి నిదర్శనం అని ఆయన అంటున్నారు గానీ.. చూడబోతే.. టెండర్ల విషయంలో రేవంత్రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్న వ్యవహారాల మీద తనదైన నిఘాను పెట్టినట్లుగా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అదే నిజమైతే గనుక.. 'అధికారిక రహస్యాల వెల్లడి చట్టం' లాంటివి ప్రయోగించి.. 'రాజ్యానికి వ్యతిరేకంగా కుట్ర' చేసినందుకు రేవంత్కు కేసీఆర్ మరోసారి సినిమా చూపించినా ఆశ్చర్యం లేదని పలువురు అనుకుంటున్నారు.