త్రిష ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'నాయకి' సినిమా ఇటు తెలుగులోనూ, అటు తమిళంలోనూ డిజాస్టర్ అయి కూర్చుంది. నిజానికి ఈ సినిమాపై చాలా అంచనాలే నెలకొన్నాయి. ఆ స్థాయిలో సినిమాలోని త్రిష గెటప్ని డిజైన్ చేసి, ఫొటోల్ని వదిలారు. దాంతో, 'నాయకి' గురించి అంతా ఆసక్తిగా చర్చించుకున్నారు కూడా. కానీ, సినిమాలో మేటర్ లేక తేలిపోయింది.
'నాయకి' కోసం ఎలాగైతే త్రిష కత్తులు పట్టుకు తిరిగిన స్టిల్స్ని విడుదల చేశారో, ఇప్పుడు త్రిష తాజా చిత్రం 'మోహిని'కి కూడా అదే స్థాయిలో ప్రమోషన్ షురూ చేస్తున్నట్టున్నారు. ఫస్ట్ లుక్లో త్రిష కత్తులు పట్టుకుని కూర్చుంది. 'జగన్మోహిని' సినిమాలో జయమాలిని తరహా గెటప్లో కన్పిస్తోంది త్రిష. ఓల్డ్ గెటప్కి ట్రెండీ లుక్ ఇచ్చారంతే. 'జగన్మోహిని' సినిమా అప్పటికీ ఇప్పటికీ ఓ సెన్సేషనల్ మూవీ అని చెప్పక తప్పదు.
మరి, ఆ 'జగన్మోహిని'తో ఈ త్రిష 'మోహిని'ని ఎంతవరకు పోల్చవచ్చోగానీ, త్రిష చేతులో కత్తుల్ని చూస్తోంటే మాత్రం, ఎక్కడో తేడా కొట్టేస్తోంది. తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానున్న 'మోహిని' సినిమాని హిందీలోకీ డబ్ చేసే ఆలోచనలైతే జరుగుతున్నాయట. ఇక, ఈ సినిమాని త్రిష పర్సనల్గా తీసుకుందనీ, ప్రమోషన్ బాధ్యతల్ని తన భుజాన వేసుకుందనీ తెలుస్తోంది.
'నాయకి' సినిమా ప్రమోషన్ కోసం త్రిష అస్సలు సహకరించలేదన్న విమర్శలున్నాయి. మరి, 'మోహిని' విషయంలో త్రిష ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే.