కృష్ణవంశీ 'నక్షత్రం'కి ఎన్ని వెలుగులో.!

క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ ఏం చేసినా అది సంచలనమే. అయితే, ఈ మధ్యకాలంలో కృష్ణవంశీ జోరు బాగా తగ్గింది. రామ్‌చరణ్‌తో కృష్ణవంశీ రూపొందించిన 'గోవిందుడు అందరివాడేలే' హిట్టయి వుంటే, కృష్ణవంశీ రేంజ్‌ ఇంకోలా వుండేది. ఆ సినిమా నాటికే కృష్ణవంశీని టాలీవుడ్‌లో దాదాపు అందరూ పక్కన పెట్టేశారు. ఇక, తాజాగా కృష్ణవంశీ 'నక్షత్రం' సినిమాతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా తర్వాత బాలకృష్ణతో 'రైతు' సినిమా చేయనున్నాడు కృష్ణవంశీ. 

'నక్షత్రం' విషయానికొస్తే, మొదట్లో ఇది చిన్న సినిమాగా అంతా భావించారు. అయితే, దీనికి స్టార్‌ వాల్యూని అద్దే పనిలో బిజీ అయిపోయాడు కృష్ణవంశీ. సందీప్‌ కిషన్‌, రెజినా జంటగానటించనున్న ఈ సినిమాలో కాజల్‌ నటించడం ప్రధాన ఆకర్షణగా మారింది. తాజగా ఈ సినిమాలోకి సాయిదరమ్‌ తేజని తీసుకొచ్చారు. ఇది చాలదన్నట్లు, 'నచ్చావులే' ఫేం తనీష్‌ని ఈ సినిమాలో కృష్నవంశీ విలన్‌గా చూపించనున్నాడట. 

అంతేనా.? కథ చాలానే వుంది. పలువురు అగ్ర కథానాయకులు ఈ సినిమా కోసం అతిథి పాత్రల్లో మెరవనున్నారట. వారెవరన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. కృష్ణవంశీకి పలువురు అగ్ర హీరోలతో సన్నిహిత సంబంధాలున్నాయి. అందుకే, ఆయన అడిగితే ఎవరూ కాదనరు కదా.! ఇంతకీ, కథేంటి.? అన్న విషయం పక్కన పెడితే, రానురాను 'నక్షత్రం' సినిమాకి స్టార్‌ వాల్యూ మాత్రం విపరీతంగా పెరిగిపోతోంది. దటీజ్‌ కృష్ణవంశీ.

Show comments