సీమ నేపథ్యంలో బాలయ్య రైతు

బాలకృష్ణ ప్లానింగ్ లో ది బెస్ట్ అనిపించేసుకుంటున్నారు ఇటీవల. చకచకా ఓ క్లారిటీతో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. వందో సినిమాగా అనుకున్న రైతును పక్కన పెట్టి, శాతకర్ణి ఓకె చేసారు. చకచకా రెండు షెడ్యూళ్లు కూడా కానిచ్చేసారు. పనిలో పనిగా 101 వ సినిమాగా రైతును ఫిక్స్ చేసేసుకున్నారు. 

ఈ సినిమా చేయడానికి ఈ మధ్య కాస్త తటపటాయించారని వార్తలు వినవచ్చాయి. రైతు సమస్యలు అంటే ప్రభుత్వంపై విమర్శలు వుంటాయి..ఇలాంటివి అన్నీ అధికారపక్షమైన తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది అని భావించారని. అయితే దర్శకుడు కృష్ణవంశీ చాలా పకడ్బందీగా స్క్రిప్ట్ ను తయారు చేసి వినిపించారని, దానికి బాలయ్య ఓకె అన్నారని తెలిసింది. 

ఈ కథ రాసింది..'సాక్షి' రామిరెడ్డి. కథ సీమ నేపథ్యంలో సాగుతుందని, సీమను, సీమ రైతులను ఆదుకున్న ఆదర్శప్రాయుడైన పాత్రలో బాలయ్య కనిపిస్తారని వినికిడి. నిజానికి రామ్ రెడ్డి గతంలో వైఎస్ ను దృష్టిలో పెట్టుకుని ఓ కథగా రాసుకున్నారని, అది బాలయ్య సినిమాగా మారుతోందని తెలుస్తోంది.

Show comments