హైదరాబాద్ లో గాలి రిసెప్షన్.. ఆసక్తికరం!

బెంగళూరులో జరిగిన వివాహానికే బోలెడంత మంది తెలుగు సెలబ్రిటీలు హాజరయ్యారు. కర్ణాటక రాజకీయ ప్రముఖులతో పాటు వీళ్లు కూడా ఈ కార్యక్రమంలో మెరిశారు. బీజేపీ అధినాయకత్వం గాలి తనయ వివాహ వేడుకకు దూరంగా ఉండాలని సూచించినా.. కర్ణాటక గవర్నర్ గా ఉన్న బీజేపీ నేతతో సహా, బీఎస్ యడ్యూరప్పతో పాటు.. అనేక మంది నేతలు సంగీత్ కి, వివాహ వేడుకకు హాజరయ్యారు.

అలాగే కర్ణాటక కాంగ్రెస్ నేతలు, సిద్ధ రామయ్య మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాంగ్రెస్ నేతల్లో అంబరీష్, మంత్రి పరమేశ్వర తదితరులున్నారు. ఇక సినీ సెలబ్రిటీల విషయానికి వస్తే.. మోహన్ బాబు, బ్రహ్మానందం, శరత్ బాబు, సుధ్దాల అశోక్ తేజ, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి తదితర తెలుగు సినీ ప్రముఖులు.. తమిళ హీరో విశాల్ , కన్నడ స్టార్ హీరోలు పునీత్ రాజ్ కుమార్, రవిచంద్రన్ తో పాటు అలనాటి హీరోయిన్లు షావుకారు జానకీ, రాధిక, నిరోషా… తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

తెలుగు రాజకీయ ప్రముఖుల్లో ఈ కార్యక్రమానికి వైకాపా నేతలు హాజరు కావడం విశేషం. వైకాపా మాజీ ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, కాపు రామచంద్ర రెడ్డిలు వివాహానికి హాజరయ్యారు. కాపు రామచంద్ర రెడ్డికి గాలి జనార్ధన్ రెడ్డికి ఉన్న అనుబంధం పాతదే. ఇక భూమన.. జగన్ ప్రతినిధిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యాడని అనుకోవాల్సి వస్తోంది.

ఇక ఇప్పుడు ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఈ నెల ఇరవై వ తేదీన హైదరాబాద్ లో కూతురు వివాహ రిసెప్షన్ ను ఏర్పాటు చేస్తున్నాడు జనార్ధన్ రెడ్డి. మరి ఈ కార్యక్రమానికి ఎవరు హాజరవుతారు? ఎవరు కారు? అనేది ఆసక్తికరమైన అంశం. బెంగళూరులో పెళ్లి జరిగితేనే చాలా మంది తెలుగు సినీ ప్రముఖులు వెళ్లారు. హైదరాబాద్ లో రిసెప్షన్ కు వీళ్ల హడావుడి ఇంకా ఎక్కువగా ఉండవచ్చు.

ఇక రాజకీయ నేతల విషయానికి వస్తే.. హైదరాబాద్ లో రిసెప్షన్ కు జగన్ హాజరవుతాడా? అనేది ఒక ఆసక్తిదాయకమైన అంశం. అలాగే లోకల్ బీజేపీ నేతలు వచ్చే అవకాశం ఉంది. ఇక తెలుగుదేశం మాత్రం ఈ కార్యక్రమానికి జగన్ హాజరైతే విమర్శించడానికి కాచుక్కుర్చుంది. ఒకవైపు తమ మిత్రపక్ష పార్టీ బీజేపీ నేతలు గాలి వివాహ వేడుకల్లో చిందులేస్తున్నా.. ఏమీ మాట్లాడలేరు. ఒకవేళ జగన్ కానీ, ఆయన కుటుంబీకులు కానీ రిసెప్షన్ కు హాజరైతే.. తెలుగుదేశం పార్టీకి కొబ్బరి చిప్ప దొరికినట్టే! 

Show comments