ఎ'ఫైర్‌'.. కస్సుబుస్సులాడుతున్న కత్రినా

మన 'మల్లీశ్వరి', బాలీవుడ్‌ 'క్యాట్‌' కత్రినాకైఫ్‌ ఎఫైర్లతో అలసిపోయిందట. సల్మాన్‌ఖాన్‌, రణ్‌బీర్‌కపూర్‌.. ఇలా పలువురు హీరోలతో కత్రినాకైఫ్‌ కాస్త క్లోజ్‌గా మూవ్‌ అయ్యింది. ఓ దశలో సల్మాన్‌ఖాన్‌ని పెళ్ళాడుతుందని అంతా అనుకుంటే, అది కాస్తా బెడిసికొట్టి రణ్‌బీర్‌ పంచన చేరింది కత్రినాకైఫ్‌. తనకు కత్రినా దూరమవడం పట్ల అసహనంతో రగిలిపోయాడు సల్మాన్‌ఖాన్‌. అదంతా గతం. రణ్‌బీర్‌తోనూ కత్రినా తెగతెంపులు చేసుకుందనే ప్రచారం జరుగుతోందిప్పుడు. 

ఇదే విషయమై కత్రినాకైఫ్‌ని ప్రశ్నిస్తే, 'ఎప్పుడూ ఎఫైర్స్‌ గురించిన ప్రశ్నలేనా.?' అంటూ కస్సుబుస్సులాడింది. అవార్డుల గురించీ, కెరీర్‌ గురించీ ప్రశ్నిస్తే ఆసక్తికరమైన విషయాలు చాలా చెబుతానని కత్రినా చెప్పుకొచ్చింది. కత్రినా కస్సుబుస్సుల సంగతి అటుంచితే, ఇటీవల ఓ అవార్డ్‌ అందుకున్న కత్రినా, అవార్డుల గురించి మాట్లాడుతూ, ప్రతి అవార్డూ తనకు ప్రత్యేకమేననీ, అవార్డు దక్కాక తన ప్రాధాన్యతలు మారిపోతాయనీ, బాధ్యత పెరుగుతుందనీ అంటోంది. 

ప్రస్తుతం కత్రినా బాలీవుడ్‌లో 'జగ్గా జసూస్‌' అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో రణ్‌బీర్‌కపూర్‌ హీరో. తెలుగులో మళ్ళీ నటించేదెప్పుడు.? అని ప్రశ్నిస్తే, 'నో కామెంట్‌' అనేసింది కత్రినాకైఫ్‌. అయినా, ఇప్పుడు కత్రినాని రెమ్యునరేషన్‌ పరంగా టాలీవుడ్‌ భరించడం ఒకింత కష్టమేననుకోండి.. అది వేరే విషయం.

Show comments