తన కామెడీతో బ్రహ్మానందం తర్వాత ఆ స్థాయిలో కొన్ని సినిమాల్ని నిలబెట్టిన కమెడియన్గా పృధ్వీ తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న విషయం విదితమే. ఈ మధ్యనే 'మీలో ఎవరు కోటీశ్వరుడు' అనే సినిమాతో హీరో లాంటి పాత్రతోనూ కొత్తగా ట్రై చేశాడు పృధ్వీ. చిరంజీవి హీరోగా నటిస్తున్న 'ఖైదీ నెంబర్ 150' సినిమాలో ఛాన్స్ రాగానే ఎగిరి గంతేశాడుగానీ, ఇప్పుడా ఆనందం ఆవిరైపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
మేటరేంటంటే, 'ఖైదీ' ఫైనల్ వెర్షన్లో పృధ్వీ నటించిన సీన్స్ని తొలగించారట. ఈ విషయాన్ని స్వయంగా పృధ్వీ వెల్లడించాడు. 'ఖైదీ' సినిమాలో నటించడం నా అదృష్టం.. ఆ సినిమాలో నా సీన్స్ తొలగించడం నా దురదృష్టం.. అంటూ సోషల్ మీడియాలో పృధ్వీ చేసిన పోస్టింగ్ ఇప్పుడు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.
సినిమా అన్నాక, నిడివి ఎక్కువైతే 'కటింగ్స్' తప్పవు. 'మగధీర' సినిమానే తీసుకుంటే, అందులో ఏకంగా శ్రీహరికి సంబంధించి చాలా ఎపిసోడ్ని లేపేశారు. అఫ్కోర్స్, ఆ తర్వాత ఆ ఎపిసోడ్ని మళ్ళీ కలిపారనుకోండి.. అది వేరే విషయం. తనకు సంబంధించిన సన్నివేవాల్ని తొలగించడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన పృధ్వీ, 'సంక్రాంతి రోజు మా అమ్మ చనిపోయినందుకు ఎంత బాధపడ్డానో.. ఇప్పుడూ అంతే బాధపడ్తున్నాను..' అని వ్యాఖ్యానించడం గమనార్హం.