మెగాస్టార్‌.. మళ్ళీ రీమేకేనా.?

చిరంజీవి 'ఖైదీ నెంబర్‌ 150' సినిమా సక్సెస్‌ జోష్‌లోనే ఇంకా వున్నారు. అదే సమయంలో, వీలైనంత త్వరగా ఇంకో సినిమా పట్టాలెక్కించేయాలని కూడా ఆయన అనుకుంటున్నారట. మెగాస్టార్ తదుపరి సినిమా కూడా రామ్‌చరణ్‌ నిర్మాణంలోనే వుండబోతోంది. ఈ విషయాన్ని 'ఖైదీ' సినిమా ప్రమోషన్స్‌లోనే చిరంజీవి సెలవిచ్చారనుకోండి.. అది వేరే విషయం. 

అయితే, వెంటనే చరణ్‌తో సినిమా చేయడమా.? లేదంటే, అల్లు అరవింద్‌ నిర్మాతగా గీతా ఆర్ట్స్‌లో సినిమా చేయడమా.? అన్న విషయమై 'డిస్కషన్స్‌' ఇంకా జరుగుతున్నాయట. సురేందర్‌రెడ్డి డైరెక్షన్‌లో చిరంజీవి హీరోగా సినిమా వుండబోతోందని రామ్‌చరణ్‌ ఆల్రెడీ ప్రకటించేశాడు. చిరంజీవి కూడా ఈ విషయాన్ని ధృవీకరించేశారు. చిరంజీవితో ’కిక్‘ లాంటి  సినిమా చేస్తానంటూ 'ధృవ' టైమ్‌లో చెప్పిన సురేందర్‌రెడ్డి, ఆ తర్వాత ఆ విషయమై పెద్దగా పెదవి విప్పకపోవడం గమనార్హం. 

నిజానికి, 'ఖైదీ' సినిమా చేయడానికే చిరంజీవి చాలా టైమ్‌ తీసుకున్నారు. 'ఖైదీ' అనుకున్నాక కూడా, అది పట్టాలెక్కడానికి చాలా కాలం పట్టేసిన విషయం విదితమే. 'కత్తి'ని రీమేక్‌ చేసి 'ఖైదీ'తో హిట్‌ కొట్టిన చిరంజీవి, సహజంగానే ఇంకో రీమేక్‌పై ఆసక్తి చూపడం సహజం. కానీ, సురేందర్‌రెడ్డి ఈసారి ఎలాగైనా స్ట్రెయిట్‌ సినిమా చేద్దామనుకుంటున్నాడు. మరోపక్క, వినాయక్‌ కూడా చిరంజీవి కోసం కథను సిద్ధం చేశానని చెబుతుండడం గమనార్హం. 

రిస్క్‌ చేయడానికి మొదటి నుంచీ చిరంజీవి అంతగా ఆసక్తి చూపరు గనుక, 'ఖైదీ' సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తూ, మరో సక్సెస్‌ అలాంటిదే అందుకోవాలంటే, ఖచ్చితంగా ఇంకో రీమేక్‌ బెటర్‌.. అన్న నిర్ణయానికి వచ్చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఆల్రెడీ టాలీవుడ్‌లో ఈ విషయమై గుప్పుమంటున్నాయి. ఈ గాసిప్స్‌పై మెగాస్టార్‌ చిరంజీవి, మెగా ప్రొడ్యూసర్‌ రామ్‌చరణ్‌ స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిందే.

Show comments