నంద్యాల పోరు.. ఆయన ఇండిపెండెంట్‌గా..?

నంద్యాల ఉప పోరుకు షెడ్యూల్ విడుదల అయ్యింది.. ఇంతలోనే పోరు మరింత రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు షాకింగ్ ఫ్యాక్టర్ ఏమిటంటే.. నంద్యాల్లో తెలుగుదేశం పార్టీకి రెబల్స్ బెడద తప్పదనే మాట వినిపిస్తూ ఉండటం. భూమా బ్రహ్మానందరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించి రంగంలోకి దిగుతున్న తెలుగుదేశం పార్టీకి ఆ వర్గం నుంచినే షాకులు తగలున్నాయనే మాట వినిపిస్తోంది. నంద్యాల ఉప ఎన్నికల్లో ఏవీ సుబ్బారెడ్డి ఇండిపెండెంట్ గా రంగంలోకి దిగనున్నారనే ప్రచారం ఊపందుకుంటోంది. భూమా నాగిరెడ్డి వారసులను ఓడించడమే లక్ష్యంగా సుబ్బారెడ్డి ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశాలున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకూ ఏవీ సుబ్బారెడ్డి తెలుగుదేశం పార్టీ తరపునే ప్రచారం చేస్తూ వస్తున్నాడు. అయితే భూమా బ్రహ్మానందరెడ్డి తరపున కాదు! ఇదే ఇక్కడ కామెడీ. తెలుగుదేశం పార్టీ తరపున నంద్యాల్లో చాలా మంది తిరుగుతున్నారు. అయితే వారెవరూ భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించాలని అనుకోవడం లేదు. భూమా వారసులకు ఒక దెబ్బ పడాలని వీరు కోరుకుంటున్నారు. తమ తమ రాజకీయాల, తమ వ్యవహారాలు సాఫీగా జరగడానికి భూమా వారసులు ఓడిపోవడమే మేలని వీరు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏవీ సుబ్బారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్టుగా తెలుస్తోంది. భూమా అఖిలప్రియతో సుబ్బారెడ్డికి విబేధాలు తీవ్రస్థాయికి చేరి చాలా కాలం అయ్యింది. వీళ్ల గొడవ ఆస్తుల విషయమై అని తెలుస్తోంది. మరి వీరి మధ్య చంద్రబాబు నాయుడు పంచాయితీ అయితే చేశాడు. కానీ.. బాబు పంచాయితీలు చేస్తే అవేవీ తెగే వ్యవహారాలు కావు. దీంతో సుబ్బారెడ్డి, అఖిలప్రియల మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తనేంటో తెలియ జెప్పాలని.. ఇండిపెండెంట్ గా బరిలోకి దిగాలని భావిస్తున్నాడట. ఇప్పటికే అఖిలప్రియను చంద్రబాబు నాయుడు, ఇతర తెలుగుదేశం నేతలు తమ మాట తీరుతో అదరగొడుతున్నారు. ఆమె ప్రచారం తప్పం మరేం చేయడానికి వీల్లేదు.. పంపకాలన్నీ వేరే వాళ్లు చూసుకుంటారు తప్ప..అఖిలప్రియకు ఆ విషయంలో హక్కుల్లేవు అన్నట్టుగా చేసేశారు. డబ్బు భూమా ఫ్యామిలీది అథారిటీ వేరే వాళ్లది అన్నట్టుగా తయారైంది వ్యవహారం. దీంతో.. నంద్యాల టీడీపీలో ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో సుబ్బారెడ్డి కూడా ఇండిపెండెంట్ గా రంగంలోకి దిగితే.. రచ్చ పీక్స్ కు చేరడం ఖాయం.

Show comments