పూరి 'బాలయ్య ఫ్యాన్స్‌' అధ్యక్షుడు.!

'పైసావసూల్‌' సినిమా పుణ్యమా అని పూరి జగన్నాథ్‌, నందమూరి బాలకృష్ణకి వీరాభిమాని అయిపోయాడు. 'ఇంతకు ముందే బాలయ్యతో ఎందుకు సినిమా తియ్యలేకపోయాను..' అని పూరి జగన్నాథ్‌ తెగ ఫీలయిపోతున్నాడు. ఇంకోసారి బాలయ్యతో సినిమా చేస్తానంటున్నాడు. వారెవ్వా, వున్నపళంగా పూరి జగన్నాథ్‌ ఇంతలా నందమూరి బాలకృష్ణ మీద వీరాభిమానం ఎలా పెంచేసుకున్నాడో ఏమో కదా.! 

సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇలాంటివన్నీ మామూలే. అయితే, పూరి జగన్నాథ్‌ లాంటి 'స్టార్‌' రేటెడ్‌ దర్శకుల నుంచి చాలా అరుదుగా ఇలాంటి మాటలు వస్తుంటాయి. ఓ హీరోకి అభిమానని చెప్పుకుంటే, ఇంకో హీరోతో సినిమా చేయాల్సి వచ్చినప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతాయేమో.! కొందరు మాత్రం అలా కాదు, మాటంటే మాటే.! 

వినాయక్‌ని తీసుకుంటే, చిరంజీవికి వీరాభిమాని.. పైగా 'అన్నయ్యా..' అని ఆప్యాయంగా పిలుస్తాడు. చాలా అరుదుగా కన్పిస్తుంటారు ఇలాంటోళ్ళు. పూరిని కూడా ఇప్పుడు ఆ కోవలోకి వేసెయ్యొచ్చేమో.! ఆగండాగండీ, ఇవే మాటలు పూరి 'పైసా వసూల్‌' తర్వాత కూడా చెబితే, అప్పుడు నమ్మొచ్చు. అప్పటిదాకా కాస్త ఆగక తప్పదు. 

అన్నట్టు, జూబ్లీహిల్స్‌ బాలయ్య అభిమాన సంఘం అనేది ఒకటి వుంటే, దానికి తానే అధ్యక్షుడినై వుండేవాడినంటూ బాలయ్య అభిమానుల నుంచి పూర్తిస్థాయిలో మార్కులు కొట్టేసేందుకు ప్రయత్నించేశాడు పూరి జగన్నాథ్‌. అన్నట్టు, చిత్ర నిర్మాత ఆనంద్‌ ప్రసాద్‌, 101 మంది పేద విద్యార్థులకు స్కాలర్‌ షిప్స్‌ అందిస్తున్నట్లు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల నుంచి విద్యార్థుల్ని ఎంపిక చేసే క్రమంలో బాలయ్య అభిమానుల సహకారం తీసుకున్నామని ఆయన చెప్పుకొచ్చారు.

Show comments