మన తెలుగు వాడు సత్యనాదెళ్ల అమెరికా దాకా వెళ్లి ప్రపంచంలోనే నెంబర్ ఒన్ సాఫ్ట్వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ కి చీఫ్ అయ్యాడని మనం సంబరపడుతుంటే ఆయన మాత్రం ట్రంప్ స్థానిక వాదానికి మద్దతుగా మాట్లాడి ఆశ్చర్యపరిచారు. అమెరికా కంపెనీల్లో అమెరికన్లకే ఉద్యోగాలివ్వాలనే ట్రంప్ ప్రాంతీయ వాదానికి వంతపాడుతున్నారు. మల్టీ నేషనల్ కంపెనీలు స్థానికులకు ప్రాధాన్యమివ్వాలని వారికి సపోర్టివ్గా ఉండాలంటూ సంస్థ డెవలపర్ సదస్సులో అభిప్రాయపడ్డారు. అంతేకాదు ఎమ్మెన్సీలు నాలుగు రోజుల పాటు నడవాలంటే స్థానికులకు ప్రయారిటీ ఇవ్వాల్సిందేనని, ప్రతి దేశం ఇలాగే ఆలోచించాలని కూడా సెలవిచ్చారు.
ట్రంప్ విపరీత ధోరణులకు వ్యతిరేకంగా అప్పట్లో చాలా బహుళ జాతి సంస్థల సీఈవోలు, చైర్మన్లు నిరసన వ్యక్తం చేశారు. కొందరు ట్రంప్ వ్యతిరేకంగా ప్రచారం చేశారు. హిల్లరీ గెలుపు కోసం ఫండ్ కూడా అందజేశారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైతే దేశం విడిచి వెళ్లడం బెటర్ అన్న స్థాయిలో కూడా మాట్లాడారు. కానీ ట్రంప్ అధ్యక్షుడయ్యాక అమెరికాలో పరిస్థితి మారిపోయింది. విదేశాల్లో బ్రాంచ్లు నెలకొల్పే కంపెనీలు, విదేశీయులకు ఉద్యోగులను నియమించుకునే సంస్థలకు సబ్స్టాన్సియల్ బోర్డర్ పన్నులు విధిస్తానన్న ట్రంప్ బెదిరింపులకు భయపడి సంస్థలన్నీ ఉద్యోగాల్లో అమెరికన్లకు ప్రాధాన్యం ఇవ్వక తప్పలేదు. హెచ్1బి వీసాలు కూడా రద్దు చేసి అమెరికాలోకి విదేశీ ఉద్యోగుల రాక వీలైనంత తగ్గించే ప్రయత్నం కూడా ట్రంట్ ప్రభుత్వం చేస్తోంది. ఎన్నికల ముందు ఎన్ని మాట్లాడినా ట్రంప్ గెలిచాక బహుళజాతి కంపెనీలన్నీ ఆయన చెప్పినట్టు నడుచుకుంటున్నాయి.
మరి గత పాలకులు కూడా ట్రంప్ లాగే స్థానికులకే ఉద్యోగాలివ్వాలి..ప్రధాన పోస్టుల్లో వారే ఉండాలి అంటే సత్యనాదెళ్ల ఈ రోజు మైక్రోసాఫ్ట్ సీఈవో అయ్యేవారా. అన్నట్టు సత్యనాదెళ్లను ఇంత వాణ్ణి చేసిన చంద్రబాబు నాయుడు ప్రస్తుతం అమెరికాలోనే ఉన్నారు. ఆయనకు ఈ విషయం తెలిస్తే ఎంత బాధపడతారు పాపం.