''ఏరు దాటేదాకా ఓడ మల్లన్న..దాటాక బోడి మల్లన్న''.. సాయం పొందాక మొహం చాటేసే వాళ్లను ఉద్ధేశించి తెలుగులో ఒక సామెత. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పరిస్థితి చూస్తుంటే ఈయన కోసమే ఆ సామెత పుట్టిందా అన్న సందేహం రాష్ట్ర రాజకీయాలను గమనిస్తున్న ఎవరికైనా కలగకమానదు. ఎందుకంటే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నేతలు ఆయన పట్ల వ్యవహరిస్తున్న తీరు అలాంటిది.
టీడీపీ నేతలది వెటకారమా.. అహంకారమో.. లేక పక్కా పథకమో తెలియదు గానీ గత ఎన్నికల్లో తమ విజయం కోసం పనిచేసిన పవన్ కళ్యాణ్ ఒక్క మాటన్నావారు తట్టుకోలేకుండా ఉన్నారు. ఒకాయనేమో ఐఏఎస్ అంటే ఉత్తరాదికో లేక దక్షిణాదికో చెందిన వారు కాదు దేశం మొత్తానికి సంబంధించిన అధికారి.. అపర మేథావి అయిన పవన్ కళ్యాణ్కు ఆమాత్రం తెలియదా అని వెటకరిస్తాడు.. ఇంకొకాయనేమో పవన్ ఎవరు సినిమా నటుడా.. నేను సినిమాలు చూడను.. ఆయనెవరో కూడా తెలియదు.. అని చులకన చేస్తాడు.. ఇప్పుడు టీడీపీ తీరు చూస్తే ఇకపై పవన్ కళ్యాణ్తో మనకు ఏమీ పని లేదని రూఢీ కి వచ్చినట్టు తెలుస్తోంది.
ఒక దారీ తెన్నూ, రూపు రేఖ, విధానం సిద్ధాంతం లేకుండా ట్విట్టర్ వేదిగగా నడుస్తున్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో తెగతెంపులు చేసుకునేందుకే తెలుగు తమ్ముళ్లు తొందరగా ఉన్నారు. ఇకపై పవన్ కళ్యాణ్ ప్రశ్నలకు అంతే సూటిగా.. ఇంకా ఎక్కువమాట్లాడితే అంతకు మించి ఘాటుగా సమాధానం చెప్పాలని పచ్చ పార్టీ ఫిక్స్ అయిపోయింది. పవన్ పై ఇక మెతకవైఖరి అవలంబించాల్సిన అవసరం లేదని ఏదో ఎన్నికల్లో ఉడతా భక్తి సాయం చేశాడు కాబట్టి ఆపాటి గౌరవమైనా ఇస్తున్నామని ఇకపై ఆయన్ని ట్రీట్ చేసే విధానం వేరే విధంగా ఉంటుందని తెలుగుదేశం నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
టీటీడీ ఈవోగా ఉత్తరాదికి చెందిన ఐఏఎస్ అధికారిని నియమించడంపై ట్విట్టర్ ద్వారా పవన్ ఆవేశం వెలిబుచ్చిన విషయాన్ని ప్రస్తావించినప్పుడు కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు అసలు తనకు పవన్ కళ్యాణ్ ఎవరో కూడా తెలియదని చెప్పడం పవర్స్టార్ అభిమానులనే కాదు గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ను తెలుగుదేశం వాడుకున్న తీరు గమనించిన ప్రతి ఒక్కరినీ బాధిస్తోంది. ''ఏం పవన్ అన్ని విషయాల్లో అనుభవమున్న చంద్రబాబును మళ్లీ ఆంధ్రాకు సీఎం చేయండని ఎన్నో వేదికల మీద సినిమా ఫక్కీలో ఆవేశపూరిత ప్రసంగాలు దంచావే అప్పుడెప్పుడూ రాజుగారు మిమ్మల్ని చూడలేదా.
తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల మూడు జెండాలు మెడకు చుట్టుకుని మోదీ, చంద్రబాబు, నేను కలిస్తే మూడు కాదు నూటా పదకొండు అని, కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో బాబుతోనే మనం బాగుపడతామని సూక్తి ముక్తావలి వల్లించావే అప్పుడన్నా ఆయనకు నువ్వు కనబడలేదా.. అదీ కాకపోతే అపర మేథావిగా గుర్తింపు పొంది ఖండాంతర ఖ్యాతి గడించేలా అమెరికాలోని హార్వర్డ్ యూనివర్శిటీలో నువ్వు చేసిన ప్రసంగం అయినా రాజు గారు వినలేదా..ఒక వేళ నిజంగానే నువ్వెవరో తెలియకపోతే వారికి నువ్వెవరో తెలియజెప్పాల్సిన సమయం వచ్చింది. వారు అనుభవిస్తున్న అధికార దర్పానికి నువ్వు కూడా కారకుడివన్న విషయం గుర్తుచేయాల్సిన అవసరం వచ్చింది. ఇప్పటికైనా నువ్వు స్పందించకుంటే రాజు గారు అన్న మాటలే రేప్పొద్దున రాష్ట్ర ప్రజలందరూ అనాల్సి ఉంటుంది. సో.. లే..లే. .లేలే ఇవ్వాలే లేలే.. పవన్.. నీవు చూపించిన స్ఫూర్తితో..