ఆగిపోయిన విక్రమ్ సినిమా

విక్రమ్-గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ ధృవ నక్షత్రం షూటింగ్ ఆగిపోయింది. ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైన ఈ మూవీ అప్పట్నుంచి షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. తాజాగా విక్రమ్-మీనన్ మధ్య కథలో అభిప్రాయబేధాలొచ్చి షూటింగ్ ఆగిపోయినట్టు తెలుస్తోంది.

షూటింగ్ సగం అయిన తర్వాత కథను మార్చేయడం గౌతమ్ మీనన్ కు చాలా ఇష్టం. సాహసం శ్వాసగా సాగిపో సినిమా విషయంలో కూడా అదే చేశాడు. సెకెండాఫ్ మొత్తం మార్చేశాడు.

అందుకే ఆ సినిమా చూస్తే రెండు సినిమాల్ని ఒకేసారి చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు ధృవనక్షత్రం విషయంలో కూడా అలాంటి ప్రయోగాలే చేయబోయాడు గౌతమ్ మీనన్. కానీ ఇక్కడున్నది నాగచైతన్య కాదు, విక్రమ్. ఇంకేముంది షూటింగ్ ఆపేశాడు.

ధృవనక్షత్రం ప్రాజెక్టు ఇప్పటిది కాదు. ఇందులో హీరో గూఢచారి. కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఇది. ఇదే కథను గతంలో ఒకసారి మహేష్ కు వినిపించాడు మీనన్. తర్వాత సూర్య హీరోగా ఈ సినిమా దాదాపు ఫైనలైజ్ అయింది.

కానీ మళ్లీ ఆగిపోయింది. ఎట్టకేలకు ఇందులో నటించేందుకు విక్రమ్ ఒప్పుకున్నాడు. షూటింగ్ కూడా స్టార్ట్ చేశాడు. కానీ సగం షూటింగ్ తర్వాత స్క్రిప్ట్ ను గౌతమ్ మీనన్ మరోసారి కెలికేయడంతో విక్రమ్ కు చిర్రొత్తికొచ్చి షూటింగ్ ఆపేశాడట.

ప్రస్తుతం ధృవనక్షత్రం సినిమాకు కేటాయించిన కాల్షీట్లన్నీ స్కెచ్ అనే మరో సినిమాకు ఇచ్చేశాడట విక్రమ్. ఆ సినిమా ఇప్పుడు శరవేగంగా సిద్ధమౌతోంది. మరి ధృవనక్షత్రం ఎప్పుడు మళ్లీ సెట్స్ పైకి వస్తుందో తెలీదు. కొసమెరుపు ఏంటంటే, ఈ సినిమాను తన ఫ్రెండ్స్ తో కలిసి స్వయంగా గౌతమ్ మీనన్ నిర్మిస్తున్నాడు.

Show comments