నాగార్జునకు.. నిద్ర పట్టనివ్వని కథ ఏదబ్బా!

‘నరుడా .. డోనరుడా’ సినిమా ఆడియో విడుదల వేడుకలో అక్కినేని నాగార్జున ఆసక్తికరమైన విషయాలను చెప్పాడు. మేనల్లుడి సినిమాను ప్రమోట్ చేయడంలో భాగంగా ఈ సినిమా గురించి గొప్పగా మాట్లాడిన నాగ్.. తన తదుపరి సినిమా గురించి కూడా ఒక మాట చెప్పాడు. ప్రస్తుం ‘ఓం నమో వెంకటేశాయ’ సినిమా చేస్తున్న నాగ్ దాని తర్వాత చేయడానికి కథలను వినే క్రమంలో ఒక మంచి కథ విన్నానని తెలిపాడు.

ఆ కథ అద్భుతంగా ఉందని.. ‘అసలు నిద్ర పట్టనివ్వడం లేదు..’ అని నాగ్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఆ కథను విన్నప్పటి నుంచి దాన్ని ఎప్పుడెప్పుడు సినిమా గా చేద్దామా అని.. నాగ్ ఉత్సాహంగా ఉన్నాడట. మరి మిగతా వారితో పోలిస్తే బోలెడన్ని ప్రయోగాత్మక సినిమాలు చేసిన తెలుగు హీరో నాగార్జున. 

అలాంటి నాగ్ కే నిద్ర పట్టనివ్వని కథ అంటే.. అది ప్రేక్షకుల్లో కూడా ఉత్సాహాన్ని కలిగించే అంశమే. తన వయసును దృష్టిలో ఉంచుకుని.. ఇమేజ్ కే ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వకుండా.. వైవిధ్య భరిత సినిమాలు చేయడానికి నాగ్ ప్రాధాన్యతను ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే ‘మనం’ ‘సోగ్గాడే..’ వంటి సినిమాలు వచ్చాయి. ఈ రకంగా ప్రేక్షకులకు సంతృప్తినే ఇస్తున్న నాగార్జున తదుపరి తనే ఉద్వేగభరితుడవుతూ.. తీయబోయే ఆ సినిమాతో ఎలాంటి అనుభూతిని ఇస్తాడో చూడాల్సి ఉంది. 

అలాగే తనకు నిద్రపట్టనివ్వని ఆ కథ.. ఎవరు రాశారు, ఎవరు దర్శకత్వం వహించబోతున్నారో కూడా నాగ్ చెప్పలేదు. జస్ట్ ‘నిద్ర పట్టనివ్వడం లేదు..’ అనే మాటతో ఆ ప్రాజెక్టుపై అందరి దృష్టి పడేటట్టు చేశాడు.

Show comments