పవన్‌ పంచ్‌తో వారికి ఆనందం !

తనదైన రాజకీయ పరిభాషతో నిత్యం మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసే విశాఖ జిల్లా సీనియర్‌ మంత్రికి సినీ నటుడు, జనసేన అధిపతి పవన్‌కల్యాణ్‌ ట్వీట్‌ ద్వారా సరైన పంచ్‌ ఇచ్చారు. ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిన వారే ఇలా మోకాలడ్డడం ఏంటంటూ పవన్‌ ఫైర్‌ అయిన  నేపధ్యంలో జిల్లాలోని మరో మంత్రి గంటా శిబిరంలో ఆనందం కనిపిస్తోంది. ఇంతకాలం నోటికి వచ్చినట్లుగా విమర్శలు చేస్తున్న మంత్రికి సరైన ఝలక్‌ తగిలిందని ప్రత్యర్ధి వర్గం అంటోంది.

కాగా, ఇటీవల కాలంలో జిల్లా టీడీపీలో ఇద్దరు మంత్రుల దారులూ వేరుగానే ఉన్నాయి. సంక్రాంతికి విడుదలైన బాలకృష్ణ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణిని మంత్రి అయ్యన్న వీక్షిస్తే మెగాస్టార్‌ 150వ చిత్రం ఖైదీకి తమ పలుకుబడి ఉపయోగించి థియేటర్లు ఇప్పించి అన్నయ్యకు అసలైన తమ్ముళ్లమనిపించుకున్నారు. మంత్రి గంటా వర్గీయులు. జనసేన అధిపతిపై ఇప్పటివరకూ గంటా ఎపుడూ నేరుగా విమర్శలు చేయకుండా జాగ్రత్తపడుతూ వస్తూండడం కూడా వ్యూహాత్మకమే. అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద మెప్పు పొందేందుకు అన్నట్లుగా అయ్యన్న పరుషమైన వ్యాఖ్యలు చేయడంతో ఇపుడు అది ఎదురుతిరిగి ఆయనకే పంచ్‌ పడింది.

కాగా, అయ్యన్న తన మాటల దాడితో విపక్ష నేత జగన్‌ను సైతం విడిచిపెట్టకుండా పిచ్చోడంటూ వ్యాఖ్యలు చేయడం పట్ల వైసీపీ శ్రేణులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇటీవల కాలంలో అయ్యన్న సహనం కోల్పోవడమే కాకుండా ఇష్టారాజ్యంగా విమర్శలు చేస్తూ పోతున్నారని ఆయన వర్గీయులే మధన పడుతున్నారు. తన నియోజకవర్గం నర్శీపట్నంలో అయ్యన్న మాట్లాడుతూ, జగన్‌ను ప్రజలు ఓడించి మాకు అధికారం ఇచ్చారు. మా ఇష్టానుసారం పరిపాలన చేస్తాం, అడిగేందుకు అతనెవరంటూ ఓ స్ధాయిలో రెచ్చిపోవడం పట్ల కూడా వైసీపీ గుర్రుగా ఉంది.

పదహారు నెలల పాటు జైలులో ఉండి వచ్చిన నేరస్తుని వద్ద పాఠాలు నేర్చుకోనవసరం లేదంటూ అయ్యన్న  చేసిన వ్యాఖ్యలు సైతం దుమారం రేపాయి. ఈ నేపధ్యంలో పవన్‌ రూపంలో ఆయనకు బాగానే పంచ్‌ పడిందని, ఇకనైనా నోరు జాగ్రత్త చేసుకుంటే మంచిదని, అటు వైసీపీతో పాటు, ఇటు గంటా వర్గీయులు కూడా భావిస్తున్నారు. మరి, అయ్యన్న నోరు జోరు తగ్గిస్తారా లేదా అన్నది చూడాలి.

Show comments