సరదాకి: 'కాపు' పౌరుషానికి తాళం.!

మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం భలే కామెడీలు చేస్తుంటారు. పౌరుషానికి తాళం తీయాల్సిన టైమొచ్చిందంటూ కాపు సామాజిక వర్గాన్ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారాయన. సంచలన వ్యాఖ్యలు కావివి, కామెడీ స్కిట్‌ని తలపించేస్తున్నాయి. కామెడీ కాకపోతే మరేమిటి.? అసలు పౌరుషానికి తాళం వేసిందెవరు.? తియ్యాల్సిందెవరు.! 

ముద్రగడ పద్మనాభం అన్నీ ఆలోచించే వ్యాఖ్యలు చేస్తారా.? అన్న అనుమానం కలుగుతుంటుంది ఒక్కోసారి. మంత్రిగా పనిచేశారు.. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో రాజకీయంగా చక్రం తిప్పారాయన. అలాంటి ముద్రగడ ఇలాంటి సిల్లీ స్టేట్‌మెంట్స్‌ ఇస్తే, కాపు సామాజిక వర్గం కూడా కామెడీ చేసుకుని తీరాల్సిందే. దటీజ్‌ ముద్రగడ పద్మనాభం. వయసు మీద పడ్తోండడంతో బహుశా రాజకీయ వ్యూహాలు రచించలేక ప్రతిసారీ బోల్తా కొట్టేస్తున్నట్టున్నారీ సీనియర్‌ పొలిటీషియన్‌. 

అయినా, ప్రతిసారీ ముద్రగడ డైలాగులకు ఆవేశంతో ఉప్పొంగిపోయే పరిస్థితి నేటితరం కాపు నేతల్లో లేదన్నది నిర్వివాదాంశం. ఓ సమస్యను పట్టుకుని, సీరియస్‌గా ఉద్యమాలు చేస్తే దానికి ఓ లెక్కుంటుంది. కానీ, టైమ్‌ పాస్‌ కోసం అప్పుడప్పుడూ దీక్షలు చేస్తే, అందులో 'తిక్క'ని మాత్రమే జనం గుర్తిస్తారు. కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లను ప్రకటిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన మాట వాస్తవం. ఎన్నికల్లో ఇచ్చిన ఆ హామీని ఎన్నికలయ్యాక తుంగలో తొక్కేసిందీ నిజమే. కానీ, ముద్రగడ మాత్రం ఈ విషయంలో చంద్రబాబుని నిలదీయలేకపోతున్నారు. 

ఆ విషయం పక్కన పెడితే, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు పొలిటికల్‌ హీట్‌ పెరిగింది ప్రత్యేక హోదా నినాదం కారణంగా. రియల్‌ పొలిటీషియన్‌ ఎవరైనాసరే, ఈ అంశాన్ని క్యాష్‌ చేసుకోవడానికి చూస్తారు. చిత్రంగా ముద్రగడ, అసలు ప్రత్యేక హోదా అంశం తన పరిధిలోనిది కాదన్నట్లే వ్యవహరిస్తుండడం గమనార్హం. 

ముద్రగడ పద్మనాభం ఒక్కరే కాదు, కాపు సామాజిక వర్గ ప్రముఖులైన మాజీ కేంద్ర మంత్రులు చిరంజీవి, దాసరి నారాయణరావు కూడా అంతే. పవన్‌కళ్యాణ్‌ సంగతి ఇప్పుడు కొత్తగా చెప్పేదేముంది.? ఒకర్ని మించి ఒకరు పౌరుషానికి పెట్టింది పేరు. అఫ్‌కోర్స్‌.. ఆ పౌరుషం మాటల్లోనే, చేతల్లోకొచ్చేసిరిక అందరూ ఆ తానులోని గుడ్డముక్కలే.!

Show comments