అతిథులొస్తున్నారు జాగ్రత్త.!

తెలుగు రాష్ట్రాలకు హెచ్చరిక.. చెన్నయ్‌ నుంచి అతిథులొస్తున్నారు.. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను వున్నపళంగా తాను 'దాచిన' స్థలాల నుంచి మార్చేందుకు 'చిన్నమ్మ' శశికళ ప్లాన్‌ చేశారు. కర్నాటకకు తరలించాలని ముందు అనుకున్నా, కర్నాటకతో తమిళనాడుకున్న 'నీటి వైరం' కారణంగా.. ఆ ప్రయత్నాన్ని విరమించుకుని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలైతే 'సేఫ్‌ జోన్‌' అని నిర్ణయించుకున్నారట శశికళ. 

తమిళనాడులో అత్యంత జుగుప్సాకరమైన రాజకీయాలు నడుస్తోన్న విషయం విదితమే. ఎమ్మెల్యేలను క్యాంపులకు తరలించి, అక్కడ నానా రచ్చా చేసేస్తున్నారు. ప్రైవేటు, అటవిక రాజ్యం నడుస్తోంది ఎమ్మెల్యేల క్యాంపుల చుట్టూ. హైకోర్టు సూచన మేరకు పోలీసులు, ఎమ్మెల్యేల సమాచారం కనుగొనేందుకు ప్రయత్నిస్తుండడంతో.. వున్న పళంగా వారిని తరలించాల్సిన అవసరమేర్పడింది శశికళకి. తప్పదు మరి, వాళ్ళే కదా శశికళ రాజకీయ భవిష్యత్తుని డిసైడ్‌ చేసేది. 

కోట్ల రూపాయల్లో ఖర్చవుతున్నాసరే, ఎమ్మెల్యేలను 'మంద'లా మేపాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే చిన్నమ్మ, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో ఎంపిక చేసిన ప్రాంతాల్లో 'క్యాంప్‌లకు' వ్యూహం సిద్ధం చేశారట. రాత్రికి రాత్రి ఎమ్మెల్యేలందర్నీ ఈ రెండు రాష్ట్రాలకీ శశికళ తరలించనున్నట్లు సమాచారం. వాళ్ళొస్తే మనకేంటట.? అనుకునేరు. ఎమ్మెల్యేలతోపాటు, శశికళ ప్రైవేటు సైన్యం కూడా వస్తుంది కదా.! ఆ సైన్యం తమిళనాడులో చేసిన 'అతి' ఇక్కడా చేయరని గ్యారంటీ ఏంటి.? 

పైగా, క్యాంపు రాజకీయాలంటే అందులో గానా భజానా సహా అనేకం వుంటాయి. 'అబ్బే, అక్కడ తిండి కూడా పెట్టడంలేదు..' అంటూ కొందరు ఎమ్మెల్యేలు చిన్నమ్మ 'వల' నుంచి జారిపోయాక, మిగిలిన ఎమ్మెల్యేలకి 'బీభత్సమైన సౌకర్యాలు' షురూ చేసేశారు. అందులో, 'రేవ్‌ పార్టీలూ వున్నాయ్‌..' అనే గాసిప్స్‌ విన్పిస్తుండడం కొసమెరుపు.

Show comments