చిరంజీవి గారితో న‌టించ‌డం ఎమేజింగ్‌: కాజ‌ల్‌

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా న‌టిస్తున్న తాజా చిత్రం- `ఖైదీ నంబ‌ర్ 150`.  `బాస్ ఈజ్ బ్యాక్‌` అనేది ఉప‌శీర్షిక‌. వి.వి.వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ‌మ‌తి సురేఖ కొణిదెల స‌మర్పణ‌లో కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ  పతాకంపై మెగాపవర్‌స్టార్‌ రామ్ చరణ్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తయింది.  ఈ చిత్రంలో కథానాయికగా చందమామ కాజల్‌ని ఫైనల్ చేసిన‌ సంగతి తెలిసిందే.

ప్రస్తుతం హైద‌రాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో చిరంజీవి - కాజ‌ల్ జంట‌పై కొన్ని కీల‌క స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆన్‌లొకేష‌న్ నుంచి కాజ‌ల్ మాట్లాడుతూ -``సినీప‌రిశ్రమ‌లోకి ప్రవేశించాక‌.. మెగాస్టార్ చిరంజీవి గారు న‌టించిన సినిమాలు చాలా చూశాను. అంత పెద్ద లెజెండ్ స‌ర‌స‌న నాయిక‌గా న‌టించ‌డం అమేజింగ్ అనిపిస్తోంది. ఇంత మంచి అవ‌కాశం వ‌చ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం షూటింగులో పాల్గొన‌డం ఎగ్జ‌యిటింగ్‌గా ఉంది. ఈరోజు నాకు మొద‌టిరోజు షూటింగ్‌. మునుముందు షెడ్యూల్స్ కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నా`` అంటూ సంతోషం వ్యక్తం చేశారు. 

ప్రస్తుతం శంషాబాద్ ప‌రిస‌రాల్లో కొన్ని యాక్షన్ స‌న్నివేశాల‌తో పాటు నాయ‌కానాయిక‌ల మ‌ధ్య జ‌రిగే కీల‌క స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ర‌త్నవేలు వంటి టాప్ సినిమాటోగ్రాఫ‌ర్ ఛాయాగ్రహ‌ణం అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Show comments