బుల్లితెర నాకు కొత్త బంగారు లోకం: శ్వేత

వెండితెరపై ఇంకా అవకాశాలొస్తున్నా, బుల్లితెర తనకిప్పుడు కొత్త బంగారు లోకంలా కనిపిస్తోందని చెబుతోంది తెలుగులో 'కొత్త బంగారు లోకం' సినిమాతో పరిచయమైన ముద్దుగుమ్మ శ్వేతా బసు ప్రసాద్‌. గత కొంతకాలంగా ఆమె తెలుగు తెరకు దూరంగా వుంటోంది. ఈ మధ్యనే ఓ సినిమాలో కన్పించిందనుకోండి.. అది వేరే విషయం. 

ప్రస్తుతం బాలీవుడ్‌లో ఒకటీ అరా సినిమాలు చేస్తోన్న ఈ బ్యూటీ, 'చంద్ర నందిని'గా బుల్లితెరపై కనిపించబోతోంది. ఈ హిందీ సీరియల్‌పై చాలా ఆశలే పెట్టుకుంది శ్వేతా బసు ప్రసాద్‌. చంద్ర గుప్త మౌర్యుడి భార్య పాత్రలో కన్పించనున్న శ్వేత, ఈ పాత్ర తన రియల్‌ లైఫ్‌ క్యారెక్టర్‌కి దగ్గరగా వుంటుందనీ, చారిత్రక నేపథ్యమున్న కథే అయినా, ఇందులోని తన పాత్ర నేటి మహిళా లోకానికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పుకొచ్చింది. 

'చంద్ర నందిని'కి సంబంధించి తన ఫొటోల్ని ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ, ఆ సీరియల్‌ని ప్రమోట్‌ చేయడంతో పాటు, తనను తాను ప్రమోట్‌ చేసుకుంటోంది శ్వేతా బసు ప్రసాద్‌. హిందీలోనేనా.? తెలుగు బుల్లితెరపై కన్పించరా.? అనడిగితే, తెలుగులో ఆల్రెడీ ఓ 'స్టంట్‌ షో' చేశాను గనుక, బుల్లితెరపై సీరియల్స్‌లో నటించే అవకాశం వస్తే తప్ప కుండా చేస్తానంటోంది శ్వేతా బసు ప్రసాద్‌. ఓ వైపు స్క్రిప్ట్‌ కన్సల్టెంట్‌గా సినిమాలు చేస్తూ, ఇంకోపక్క అడపా దడపా సినిమాల్లో నటిస్తూ, బుల్లితెరపైనా బిజీ అవుతున్న శ్వేత మదిలో డైరెక్షన్‌ ఆలోచనలు కూడా వున్నాయట. అయితే, దానికింకా సమయం వుందంటోంది శ్వేతా బసు ప్రసాద్‌.

Show comments