బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ విషయాన్ని పూరి నిన్న ప్రకటించేసరికి అంతా షాక్కి గురయ్యారు. గత కొంతకాలంగా ఈ విషయమై గాసిప్స్ విన్పిస్తున్నా, 'పూరి ఎప్పుడు చెయ్యాలిలే..' అనుకున్నారంతా. కానీ, పూరి సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందో, ఎప్పుడు విడుదలవుతుందో కూడా ట్విట్టర్లో ఖరారు చేసేశాడు. ఇది బాలకృష్ణ కెరీర్లో 101వ సినిమా.
అన్నట్టు, చిరంజీవి 150వ సినిమాకి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించి వుండాల్సింది. అయితే, పూరి చెప్పిన కథలో చిరంజీవి మార్పులు చేర్పులు కోరారు. అది పూరికి నచ్చలేదు. అలా ఆ ప్రాజెక్ట్ అటకెక్కింది. ఈ విషయమై బాహాటంగా చిరంజీవి, రామ్చరణ్ మాట్లాడేసరికి పూరి 'ఇగో' హర్ట్ అయ్యింది. రైట్ టైమ్ కోసం పూరి ఎదురుచూశాడు. ఇప్పుడు ఆ రైట్ టైమ్ రానే వచ్చింది. ఇగో సంగతెలా వున్నా, దర్శకుడిగా తన సత్తా చాటుకోడానికి పూరి జగన్నాథ్, బాలకృష్ణ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిందే.. తప్పదు.
ఈ మధ్యకాలంలో పూరి చేసిన సినిమాల్లో 'లోఫర్', 'ఇజం' సినిమాలు దారుణమైన పరాజయాన్ని చవిచూశాయి. త్వరలో 'రోగ్' సినిమా రాబోతోంది. ఆ సినిమాపైనా అనుమానాలున్నాయి. నిజానికి పూరి తక్కువోడేం కాదు. కానీ, రోజులెప్పుడూ ఒకేలా వుండవ్ కదా.! స్టార్ డైరెక్టర్ కాస్తా, సాదా సీదా దర్శకుడైపోయాడు. సెన్సేషనల్ హిట్ ఒకటి కొట్టి మళ్ళీ పూరి సత్తా చాటి తీరాల్సిందే. అది బాలకృష్ణతో అయితే ఆ కిక్కే వేరప్పా.! ఇంతకీ పూరి మార్క్ హీరోయిజం బాలయ్యలో చూడగలమా.?