సీఎం చంద్రబాబునాయుడికి నంద్యాల ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుంది. అందుకే నంద్యాల పర్యటన సందర్భంగా టీడీపీకి ఓటేయని గ్రామాలకు పనులు కూడా చేయనని స్థాయి దిగజారి మరీ బెదిరింపులకు దిగాడు. నయానో, భయానో ఓటర్ల చేత సైకిల్ గుర్తుపై ఓటేయించాలని పార్టీ కార్యకర్తలు, రౌడీలను ఇప్పటికే ఉసిగొల్పాడు. ఎలాగైనా నంద్యాల గెలిచి తీరాల్సిందే ఇందులో మరో పశ్నకు తావేలేదన్న అధినేత ఆదేశాల మేరకు పచ్చ బ్యాచ్ రెచ్చిపోతున్నారు.
జిల్లాకు చెందిన మంత్రలు అఖిల, కేఈ కృష్ణమూర్తితో పాటు మరో నలుగురు మంత్రలు కాల్వ శ్రీనివాసులు, నారాయణ, అమర్నాధ్రెడ్డి, ఆదినారాయణరెడ్డిలను నంద్యాలలో మోహరించారు. నంద్యాల నియోజకవర్గంలో టీడీపీకి ఓటేయని వారికి పెన్సన్లు, రేషన్ కార్డులు ఇతర ప్రభుత్వ పథకాలు తొలగిస్తారనే ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ పథకాలపై ఆధారపడిన నిస్సహాయులు తెలుగుదేశం కార్యకర్తల బెదిరింపులకు వణికిపోతున్నారు.
ఎన్నికల్లో పార్టీ నేతలు, కార్యకర్తలకు సీఎం చంద్రబాబు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. గెలుపు లక్ష్యంగా పనిచేయాలని, ఇందుకోసం ఏమి చేసినా ప్రభుత్వం, పార్టీ తరఫు నుంచి పూర్తి మద్దతు ఉంటుందని అభయం ఇచ్చారు. సర్పంచ్ స్థాయి వ్యక్తులతో కూడా బాబు నేరుగా ఫోన్లో మాట్లాడుతూ వారికి కర్తవ్యం నూరిపోస్తున్నాడు. ఇటీవల ఏవీ సుబ్బారెడ్డి మద్దతుదారులు కొందరు టీడీపీలో చేరారు.
కార్యకర్తల స్థాయి మించని వారితో చంద్రబాబు స్వయంగా ఫోన్లో మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. పార్టీ విజయం కోసం కష్టపడాలంటూ బాబు ఫోన్లో కార్యకర్తలకు సూచించారు. ఇలా పార్టీలో చేరాలనుకునే చిన్నస్థాయి కార్యకర్తల స్థాయి వ్యక్తలతో కూడా సీఎం నేరుగా ఫోన్లో మాట్లాడవచ్చని, తమ సమస్యలు చెప్పుకోవచ్చని స్థానిక టీడీపీ నేతలు ప్రజలను ఆకర్శిస్తున్నారు.
ఎన్నికలు ముగిసేవరకూ నంద్యాల పార్టీ ముఖ్యనేతలు ఎప్పుడైనా తనకు ఫోన్ చేయొచ్చని బాబు సూచించారట. పార్టీ విజయం కోసం ఎలాంటి వనరులు కావాలన్నా అడగవచ్చని తెలిపారు. అయితే ఈ అవకాశాన్ని పార్టీ నేతలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకునేందుకు వినియోగించుకుంటుండంతో ఆగ్రహం చెందిన బాబు నంద్యాల నేతల ఫోన్లకు స్పందించడం మానేశారట.
తనకు ఫోన్ చేయాల్సిన పనిలేదని, ఏమన్నా ఉంటే మంత్రి అఖిలప్రియకు గానీ, ప్రచార బాధ్యతలు మోస్తున్న ఇతర మంత్రులకు గానీ చెప్పుకోవాలని సూచించారట. నంద్యాల ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హడావుడి అభివృద్ధి పనులు కొన్నింటికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న పలు కార్యక్రమాలకు చంద్రబాబు అమోదముద్ర వేశారు. వీటిని ప్రచారంలో బలంగా వినిపించనున్నారు.