పూరిజగన్నాథ్‌ ఎంత బిజీగా వున్నాడో.!

డ్రగ్స్‌ ఆరోపణలపై స్పందించడానికి పాపం దర్శకుడు పూరిజగన్నాథ్‌కి అస్సలు టైమ్‌ లేదండోయ్‌. బాలకృష్ణతో తెరకెక్కిస్తోన్న 'పైసా వసూల్‌' సినిమా పనుల్లో ఆయన చాలా చాలా బిజీగా వున్నాడట. దాదాపు 19మంది వరకు టాలీవుడ్‌ ప్రముఖులకు ఎక్సయిజ్‌ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ 'సిట్‌' నుంచి నోటీసులు వెళ్ళాయన్న ప్రచారం జరుగుతోంది. మీడియాలో విన్పిస్తోన్న సినీ ప్రముఖుల పేర్లకు సంబంధించి కొందరు వ్యక్తులు ఇప్పటికే స్పందించారు.

నవదీప్‌, సుబ్బరాజు తదితరులు నోటీసులు అందాయని చెబుతోంటే, అబ్బే అలాంటి నోటీసులు తమకేమీ రాలేదని తనీష్‌, నందు తదితరులు చెబుతున్నారు. లిస్ట్‌లో ఛార్మి, పూరిజగన్నాథ్‌, రవితేజ పేర్లు గట్టిగా విన్పిస్తున్నాయి. అధికారికంగా 'సిట్‌' ఎవరి పేర్లనూ బయట పెట్టకపోయినా, లీకుల రూపంలో ఆయా పేర్లు తెరపైకి వచ్చేశాయి. దాంతో, కొందరు స్పందించక తప్పలేదు. 

మిగతావారి సంగతెలా వున్నా, పూరిజగన్నాథ్‌ మీద కాస్త గట్టిగానే ఊహాగానాలు విన్పిస్తున్నాయి డ్రగ్స్‌కి సంబంధించి. పూరి జగన్నాథ్‌ గ్యాంగ్‌గా చెప్పుకోబడ్తున్నవారే ఎక్కువమంది ఈ డ్రగ్స్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటుండడమే అందుకు కారణం. రవితేజ, అతని డ్రైవర్‌ శ్రీనివాసరావు, సుబ్బరాజు, ఛార్మి.. ఇలా ఈ నలుగురి కారణంగానే పూరిపై ఆరోపణలు ఇంకాస్త ఎక్కువగా విన్పిస్తున్నాయి. 

పూరిజగన్నాథ్‌, 'పైసా వసూల్‌' సినిమా పనుల్లో బిజీగా వుంటే వుండొచ్చుగాక. సోషల్‌ మీడియాలో ఓ చిన్న కామెంట్‌ చేసి వుండొచ్చు.. మీడియాకి ఓ చిన్న బైట్‌ ఇచ్చి వుండొచ్చు. ఎందుకంటే, అంతలా పూరి చుట్టూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి కాబట్టి. అయితే, ఇలాంటివాటిని పూరి 'కేర్‌' చేయడం చాలా అరుదు కాబట్టి.. షరామామూలుగానే పూరి, 'ఇప్పటిదాకా స్పందించలేదు, ప్రస్తుతానికి బిజీగా వున్నాను..' అంటూ సోషల్‌ మీడియాలో ఓ కామెంట్‌ పెట్టేసి ఊరుకున్నాడు. 

ఇప్పుడు ఊరుకున్నాడు సరే, 'సిట్‌' లిస్ట్‌లో పేరుంటే, ఎంత బిజీగా వున్నాసరే పూరి విచారణకు హాజరవక తప్పదు కదా.!

Show comments