పవనిజం: బన్నీ వర్సెస్‌ తేజు

పవన్‌కళ్యాణ్‌ ఎంకరేజ్‌ చేస్తున్నాడా.? లేదా.? అన్నది వేరే విషయం. పవన్‌కళ్యాణ్‌ అభిమానులు మాత్రం, తమ అభిమాన హీరో విషయంలో అల్లు అర్జున్‌ తీరుని తీవ్రంగా తప్పుపట్టేస్తున్నారు. పవన్‌ని మర్చిపోతే ఊరుకోం.. అంటూ అల్లు అర్జున్‌ ఎక్కడ కనిపించినా అల్లరి చేసేశారు. దాంతో, పవన్‌కళ్యాణ్‌ గురించి 'చెప్పను బ్రదర్‌' అంటూ పెద్ద వివాదానికే తెరలేపాడు. ఆ తర్వాత అభిమానులకు పెద్ద క్లాస్‌ కూడా పీకేశాడు. 

అల్లు అర్జునేనా.. ఇలా అంటోన్నది.? అంటూ పవన్‌ అభిమానులు ఆశ్చర్యపోయారు. చిరంజీవి ఆశీస్సులతో, చిరంజీవి ఇమేజ్‌ అనే చెట్టు నీడకిందనే అల్లు అర్జున్‌ స్టార్‌గా ఎదిగినా, పవన్‌కళ్యాణ్‌ అభిమానుల సపోర్ట్‌ అల్లు అర్జున్‌కి ఒకప్పుడు ఓ రేంజ్‌లో వుండేది. అప్పట్లో పొద్దున్న లేస్తే బన్నీ, పవన్‌కళ్యాణ్‌ జపమే చేసేవాడు. పరిస్థితులు మారాయి. సోలో స్టార్‌డమ్‌ వచ్చాక పవన్‌ని పక్కన పెట్టాడు, చిరంజీవి కాంపౌండ్‌ని అల్లు కాంపౌండ్‌ దూరం పెట్టిందనే ఊహాగానాలూ తెరపైకొచ్చాయి. 

సరే, ఇప్పుడు ఆ విషయం పక్కన పెట్టి, అసలు విషయానికొద్దాం. ఇప్పుడు పవన్‌ తరఫున, 'చెప్తాను బ్రదర్‌' అంటూ వకాల్తా పుచ్చుకున్నాడు పవన్‌కళ్యాణ్‌ మేనల్లుడు సాయిధరమ్‌తేజ. ఇంకా ప్రూవ్‌ చేసుకోవాల్సిన స్టేజ్‌లోనే వున్నా, నాలుగు సినిమాల్లో మూడు సినిమాలతో హిట్లు కొట్టేశాడు. రేంజ్‌ కూడా పెంచేసుకున్నాడు. ఇప్పుడు 'తిక్క'తో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. 'తిక్క' ఆడియో ఫంక్షన్‌లో 'అరవండి.. అరుస్తూనే వుండండి.. అరవకపోతే మజా ఏముంటుంది.? మీతోపాటు నేనూ అరుస్తా.. నాతోపాటు మీరూ అరవగలరా.?' అంటూ అభిమానుల్ని ఉద్దేశించి ఎంకరేజ్‌ చేసేశాడు ఓ రేంజ్‌లో తేజు. పవన్‌కళ్యాణ్‌ గురించే ఇదంతా. 

చూస్తోంటే, అల్లు అర్జున్‌కి సాయిధరమ్‌తేజ ఈ టైపులో పెద్ద పోటీ ఇచ్చేలా వున్నాడు. ఏమో, అల్లు అర్జున్‌ స్టార్‌ అవుతాడని ఎవరైనా ఊహించారా.? సాయిధరమ్‌ తేజ విషయంలోనూ కాలం కలిసొస్తే ఇక చెప్పడానికేముంది.? ఆల్రెడీ టాలీవుడ్‌ యంగ్‌ డైరెక్టర్స్‌ అందర్నీ 'ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌'లోకి చేర్చేసుకున్నాడు తేజు. పైగా, ఇప్పుడు పవన్‌ ఫ్యాన్స్‌ని పూర్తిగా తనవైపుకు తిప్పేసుకున్నాడు. మెగాస్టార్‌ అభిమానుల సపోర్ట్‌ ఎలాగూ మిస్సవదు. 

ఇప్పటికిప్పుడైతే మాత్రం బన్నీని సవాల్‌ చేయాలనుకుంటే తేజు తొందరపడ్డట్లే అవుతుంది. ఎందుకంటే, అల్లు అర్జున్‌ స్టార్‌డమ్‌ ఇప్పుడు ఓ రేంజ్‌లో వుంది మరి.

Show comments