రామ్చరణ్ తాజా చిత్రం 'ధృవ' ఫస్ట్ లుక్ విడుదలైంది. సురేందర్రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా తమిళ 'తనీ ఒరువన్'కి రీమేక్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'మగధీర' స్థాయి అంచనాలు ఈ సినిమాపై వున్నాయిప్పుడు.
'తని ఒరువన్' విషయానికొస్తే, ఈ సినిమా మోహన్రాజా దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కింది. మోహన్రాజా అంటే ఎవరో కాదు, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన 'ఎడిటర్' మోహన్ తనయుడే. తమిళంలో 'తని ఒరువన్' సంచలన విజయాన్నే అందుకుంది. ఈ చిత్రంలో హీరోగా నటించింది ఎడిటర్ మోహన్ ఇంకో తనయుడు జయం రవి. ఈ సినిమాకి హీరో కన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ విలన్కే దక్కుతుంది. అరవింద్స్వామి బ్రిలియంట్ విలనిజం ఈ సినిమాకే హైలైట్.
ఇక, 'ధృవ' సినిమా ఎలా వుంటుందోగానీ, ఫస్ట్ లుక్ మాత్రం రామ్చరణ్ ఇటీవల నటించిన చాలా సినిమాల్లో వున్నట్లే వుంది తప్ప, కొత్తగా ఏమీ లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 'ఎవడు' సినిమా విషయంలోనూ కాస్త డిఫరెంట్గా డిజైన్స్ వున్నాయేమో. లుక్ పరంగా చూస్తే, మీసకట్టు ఒక్కటీ కాస్త స్పెషల్. 'మై ఎనిమీ ఈజ్ మై స్ట్రెంగ్త్' అనే క్యాప్షన్తో ఫస్ట్ లుక్ని విడుదల చేశారు.
తమిళ 'తని ఒరువన్'లో విలన్గా నటించిన అరవింద్ స్వామి ('రోజా' ఫేం) 'ధృవ'లో కూడా విలన్గా నటిస్తున్నాడు. రామ్చరణ్ సరసన 'ధృవ'లో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. వీరిద్దరూ కలిసి 'బ్రూస్లీ' సినిమాలో నటించిన విషయం విదితమే.