గతవారం విడుదలైన రెండు చిత్రాలు నిరాశ పరిచాయి. దిల్ రాజు విడుదల చేసిన 'నాన్న నేను నా బాయ్ఫ్రెండ్స్' చిత్రంపై యువతలో ఆసక్తి కనిపించింది కానీ, సినిమా మరీ మూస పోకడలతో ఉండడంతో తిరస్కరణకి గురైంది. వరుసగా మూడు ఘన విజయాలు సాధించిన హెబ్బా పటేల్కి టైమ్ కలిసి రాలేదీసారి.
పృధ్వీ ప్రధాన పాత్రలో సత్తిబాబు డైరెక్షన్లో వచ్చిన 'మీలో ఎవరు కోటీశ్వరుడు' మాస్ని సైతం ఆకట్టుకోలేకపోయింది. కథ, కథనాలు పేలవంగా ఉండడం, పేరడీ సీన్లు పేలకపోవడంతో ఇది కూడా కలెక్షన్లు రాబట్టుకోలేకపోయింది. కొత్త చిత్రాలు ఛాలెంజ్ చేయలేకపోవడం 'ధృవ'కి కలిసి వచ్చింది.
రెండవ వారాంతంలో కూడా మంచి వసూళ్లు రావడంతో ధృవ యాభై కోట్ల మార్కుకి దగ్గరగా వెళ్లింది. ట్రేడ్ రిపోర్ట్స్ని బట్టి రెండు వారాల్లో యాభై కోట్ల షేర్ దాటిన ఈ చిత్రం ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదు. ఈ వీకెండ్ కూడా వసూళ్లు డీసెంట్గా ఉంటాయని నిర్మాతలు ఆశిస్తున్నారు. వంగవీటి, సప్తగిరి ఎక్స్ప్రెస్, ఒక్కడొచ్చాడు, పిట్టగోడతో పాటు అమీర్ఖాన్ 'దంగల్' కూడా ఈ వీకెండ్లో రిలీజ్ అయింది. వీటిలో ఏవి క్లిక్ అవుతాయనేది చూడాలి.