అల్లు అర్జున్ హీరోగా రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'నా పేరు సూర్య' సినిమా లాంఛనంగా ప్రారంభమయ్యింది. అల్లు అర్జున్తో వక్కంతం వంశీ సినిమాకి సంబంధించి గత కొంతకాలంగా ఊహాగానాలు విన్పిస్తున్న విషయం విదితమే.
నిజానికి రచయితగా పలు విజయవంతమైన సినిమాలకు పనిచేసిన వక్కంతం వంశీ, దర్శకత్వమంటూ చేస్తే తన తొలి సినిమా ఎన్టీఆర్తోనేనని అప్పట్లో భీష్మించుక్కూర్చున్నాడు. ఆ మాటకొస్తే, దర్శకుడిగా ఛాన్సిస్తానని అప్పల్లో ఎన్టీఆర్, వక్కంతం వంశీకి హామీ ఇవ్వడం, ఆ తర్వాత హ్యాండివ్వడం తెల్సిన విషయాలే.
ఎన్టీఆర్ ఎటూ తేల్చకపోవడంతో చివరికి అల్లు అర్జున్ దగ్గరకి చేరిన వక్కంతం వంశీ, గతంలో ఎన్టీఆర్కి చెప్పిన కథతోనే అల్లు అర్జున్తో 'నా పేరు సూర్య' సినిమా చేస్తున్నాడట. అయితే, అల్లు అర్జున్ ఇమేజ్కి తగ్గట్టుగా చాలా సీన్స్ని మళ్ళీ కొత్తగా రాసుకున్నాడట వక్కంతం వంశీ. మాస్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.
మెగాబ్రదర్ నాగబాబు సమర్పణలో, రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీష ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళ నటుడు శరత్కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రలో కన్పించబోతున్నాడు.