సాయిధరమ్‌.. అందర్నీ చక్కబెట్టేస్తున్నాడు.!

మంచు మనోజ్‌ సినిమా 'గుంటూరోడు' ఆడియో విడుదల వేడుకకి సాయిధరమ్‌ హాజరవడం, తనకు సాయిధరమ్ మంచి స్నేహితుడని మనోజ్ చెప్పడం తెల్సిన విషయాలే. ఇక, తన కొత్త సినిమా 'జవాన్‌' ప్రారంభోత్సవానికి స్వయంగా సాయిధరమ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ని ఆహ్వానించాడు. సినిమా ప్రారంభోత్సవంలో ఎన్టీఆర్‌తో సాయిధరమ్‌ ఓ రేంజ్‌లో జోకులు పేల్చుతూ సందడి చేసేశాడు. 

ఇక, తాజాగా విడుదలకు సిద్ధమవుతోన్న తన తాజా సినిమా 'విన్నర్‌'లోని తొలి పాటని మహేష్‌ చేతుల మీదుగా విడుదల చేయిస్తున్నాడు సాయిధరమ్‌. మహేష్‌, తన ట్విట్టర్‌ అకౌంట్ ద్వారా ఈ పాటని విడుదల చేస్తాడట. అదీ ఈ రోజు సాయంత్రం 7 గంటలకి. ఇలాంటివి బాలీవుడ్‌లోనే ఎక్కువగా చూస్తుంటాం. తమ మధ్య విభేదాలెలా వున్నా, షారుక్‌ఖాన్‌ - సల్మాన్‌ఖాన్‌ ఒకరి సినిమాల్ని ఇంకొకరు ఏదో ఒకరకంగా ప్రమోట్‌ చేస్తూ వుంటారు. తద్వారా ఆయా సినిమాల మార్కెట్‌ రేంజ్‌ పెరుగుతుంటుంది. 

టాలీవుడ్‌లోనూ ఈ ట్రెండ్‌ ఇప్పుడిప్పుడే జోరందుకుంటోంది. మెగా - నందమూరి కుటుంబాల మధ్య విభేదాలనేవి అప్పుడప్పుడూ 'ప్రచారం'లోకి రావడం మామూలే. వాటిని కొట్టి పారేస్తూ, చిరంజీవి, బాలకృష్ణ స్టేట్‌మెంట్లు ఇవ్వడమూ మామూలే. మిగతా విషయాలెలా వున్నా, సాయిధరమ్‌ అయితే మొత్తం అందర్నీ ఒకేసారి చక్కబెట్టేస్తున్నట్టున్నాడు. మంచు ఫ్యామిలీతో, నందమూరి ఫ్యామిలీతో, ఇప్పుడు మహేష్‌తో.. మనోడు చాలా సరదా మనిషి. ఆ సరదానే, అందరికీ నచ్చేస్తోందేమో.!

Show comments