'కాటమరాయుడు' ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఒక్కరంటే ఒక్క మెగా హీరో కూడా కన్పించలేదు. ఎందుకట.? ఏమో మరి, మెగా కాంపౌండ్కే తెలియాలి. మెగా కాంపౌండ్.. అంటే అందులో చాలామంది హీరోలున్నారు. చిరంజీవి, రామ్చరణ్, అల్లు అర్జున్, సాయిధరమ్తేజ్, వరుణ్ తేజ్, శిరీష్.. ఇంతమందిలో పవన్కళ్యాణ్ 'ఒక్క ఒక్కడు'గా వేరుపడినట్టున్నాడు. లేకపోతే, 'కాటమరాయుడు' ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పైన చెప్పుకున్న మెగా హీరోలెవరూ ఎందుకు కన్పించలేదట.?
'ఖైదీ నెంబర్ 150' సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్కి పవన్ డుమ్మా కొట్టేశాడు గనుక, పవన్ని ఇలా 'మెగా కాంపౌండ్' పక్కన పెట్టిందనుకోవాలేమో. నాగబాబు కూడా పవన్ కోసం రాకపోవడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. కనీసం సాయిధరమ్తేజ్ కూడా అటెండ్ కాకపోవడం ఆశ్చర్యకరమే.
డుమ్మా కొట్టేసి, 'మన అందరి కాటమరాయుడు..' అంటూ బాబాయ్ పవన్కళ్యాణ్ మీద అమితమైన అభిమానం కురిపించేశాడు అబ్బాయ్ రామ్చరణ్. 'కాటమరాయుడు' ట్రైలర్ చాలా బాగుందంటూ సోషల్ మీడియాలో స్పందించిన చరణ్, ఇదిగో ఇలా 'మన అందరి..' అంటూ పేర్కొనడం గమనార్హం. 'లుక్ లైక్ పవర్ ప్యాక్డ్ సెలబ్రేషన్..' అన్నాడుగానీ, 'ప్రీ రిలీజ్ సెలబ్రేషన్'కి మెగా ఫ్యామిలీ దూరంగా వుండడాన్ని అభిమానులూ తమకు తోచిన విధంగా అర్థం చేసుకున్నారని చరణ్ అర్థం చేసుకోకపోతే ఎలా.? అన్నట్టు, నిర్మాతగా రామ్ చరణ్ తొలి సినిమా, చిరంజీవి 150వ సినిమా.. అదే ‘ఖైదీ నెంబర్ 150’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి వెళ్ళకుండా, సోషల్ మీడియాలో అన్నయ్యకీ, చరణ్ కీ శుభాకాంక్షలు తెలిపేశాడు పవన్. చరణ్ కూడా ఇప్పుడు అదే చేసినట్టున్నాడు.
కొసమెరుపు: జగమంత మెగా కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది.. అన్నట్టు తయారైంది నిన్న 'కాటమరాయుడు' ఫంక్షన్లో పవన్ పరిస్థితి.