పార్టీ ఫిరాయించే ప్రజా ప్రతినిథుల గురించి చాలా తేలిగ్గా 'రాజకీయ వ్యభిచారం' అనే మాట ఉపయోగించేస్తుంటారు రాజకీయాల్లో. వాళ్ళూ వీళ్ళూ అన్న తేడాల్లేవు.. చాలా విరివిగా రాజకీయ వ్యభిచారం అనే ప్రస్తావన రాజకీయాల్లో వచ్చేస్తుంటుంది. ఆ మాటకొస్తే, ఇదో ఊతపదం అయిపోయిందిప్పుడు. తెలుగునాట ఈ మధ్యకాలంలో 'రాజకీయ వ్యభిచారం' అన్న మాటను మించి పాపులర్ అయిన మాట ఇంకోటి లేదనడం అతిశయోక్తి కాదేమో.
కానీ, తాజాగా 'వ్యభిచారం - వ్యభిచారి' అనే మాట రాజకీయాల్లో కలకలం రేపుతోంది. కారణం, ఆ మాట ఉపయోగించింది బీజేపీ నేత కావడం, పైగా ఆ బీజేపీ నేత నోరు జారింది బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతిని ఉద్దేశించి కావడంతో వివాదం భగ్గుమంటోంది. ఉత్తరప్రదేశ్కి చెందిన బీజేపీ నేత దయా శంకర్ సింగ్, మాయావతిని విమర్శించేందుకు 'వ్యభిచారం' అనే మాట ఉపయోగించారు. మాయావతి టిక్కెట్లు అమ్ముకుంటున్నారని చెప్పడం కోసం, 'ఒక కోటి ఇస్తే టిక్కెట్ ఇస్తారు.. ఇంకెవరన్నా రెండు కోట్లు ఇస్తే క్యాండిడేట్ మారిపోతాడు.. మూడు కోట్లు ఇస్తామని ముందుకొస్తే ముందు టిక్కెట్లు దక్కించుకున్న ఇద్దరి పనీ అంతే.. మాయావతి తీరు వ్యభిచారి కన్నా దారుణం..' అనేశారాయన.
ఇంకేముంది, ఈ వివాదం ముదిరి పాకాన పడింది. బీజేపీ డ్యామేజీ కంట్రోల్ చర్యలకు దిగింది. 'దయా శంకర్ సింగ్ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నామని ప్రకటించింది. ఈ వ్యాఖ్యలకు పార్టీకి సంబంధం లేదని బీజేపీ అధికార ప్రతినిథి షైనా ఖండించి పారేశారు. ఎంత ఖండించేసినా సరే, జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయిందంతే. త్వరలో ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు జరగనున్న వేళ బీజేపీ ఇంత తీవ్రమైన వివాదంలో ఇరుక్కోవడం ఆశ్చర్యకరమే.
ఇదిలా వుంటే, తనపై అత్యంత దిగజారుడుతనంతో కూడిన వ్యాఖ్యలు చేసిన బీజేపీపై పరువు నష్టం దావా వేస్తామంటున్నారు మాయావతి. అసలే మాయవతి అంటే యూపీ రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లోనూ రెబల్. గతంలో ఆమె యూపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన విషయం విదితమే.
కొసమెరుపు: అత్యంత జుగుప్సాకరంగా తాను మాట్లాడిన మాట వాస్తవమేననీ, ఆ వ్యాఖ్యల పట్ల తాను తీవ్రంగా చింతిస్తున్నాననీ, మాయావతికి బహిరంగ క్షమాపణ చెబుతున్నానని లెంపలేసుకున్నారు దయా శంకర్ సింగ్. పార్టీ అధిష్టానం హెచ్చరికలతో ఆయన ఈ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.