శ్వేతా బసు.. బుల్లి తెరపై కొత్త కొత్తగా.!

బాల నటిగా కొన్ని సినిమాల్లో నటించి, హీరోయిన్‌గా 'కొత్త బంగారు లోకం' సినిమాతో తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చిన బెంగాలీ భామ శ్వేతా బసు ప్రసాద్‌, తక్కువ సినిమాలతోనే టాలీవుడ్‌కి దూరమవ్వాల్సి వచ్చింది. ఓ వివాదంలో ఆమె ఇరుక్కుని, పూర్తిగా టాలీవుడ్‌కి గుడ్‌ బై చెప్పేసింది. ప్రస్తుతం ఈ భామ ఓ హిందీ సీరియల్‌ ద్వారా బుల్లితెర వీక్షకుల్ని పలకరించబోతోంది. 

బాలీవుడ్‌లో స్క్రిప్ట్‌ అసిస్టెంట్‌గా కూడా కెరీర్‌ ఓ పక్క కొనసాగిస్తూ, ఇంకోపక్క ఇదిగో ఇలా బుల్లితెరపై నటిగా కొత్త ప్రస్తానాన్ని ప్రారంభించింది. 'స్టార్‌ ప్లస్‌' ఛానల్‌లో ప్రసారం కానున్న సీరియల్‌లో 'చంద్రగుప్త మౌర్యుడి భార్య చంద్ర నందిని' పాత్రలో శ్వేతా బసు ప్రసాద్‌ కన్పించబోతోంది. బుల్లితెర, వెండితెర అన్న తేడాలు తనకు లేవనీ, నటనా ప్రతిభను చాటుకోవడానికి ఏదైనా ఒకటేనంటోంది శ్వేతా బసు ప్రసాద్‌. వెండితెరపై రీ-ఎంట్రీకి శ్వేతా బసు ప్రసాద్‌ సిద్ధంగానే వున్నా, ఆమెకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించేవారే కరవయ్యారిప్పుడు. 

ఇదిలా వుంటే, తెలుగు బుల్లితెరపైనా శ్వేతా బసు ప్రసాద్‌ కన్పిస్తోంది. అయితే అది ఓ స్టంట్‌ షో. నవదీప్‌ నేతృత్వంలో నడుస్తోన్న ఆ స్టంట్‌ షోలో డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌గా ఫీట్స్‌ చేసేస్తోంది శ్వేతా బసు ప్రసాద్‌. మొదటి నుంచీ ఆమెది డేరింగ్‌ నేచరే. అదే ఇప్పుడు 'చంద్రగుప్త మౌర్య' సీరియల్‌కి కూడా ఉపయోగపడిందట. ఈ సినిమాలో ఆమె హార్స్‌ రైడింగ్‌తోపాటు, కత్తి యుద్ధాలు వంటివి చేయనుందట.

Show comments