Kalki 2898 AD Review: మూవీ రివ్యూ: కల్కి 2898 ఎ.డి

చిత్రం: కల్కి 2898 ఎ.డి
రేటింగ్: 3/5
తారాగణం:
ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకోణె, దిశా పటాని, రాజేంద్ర ప్రసాద్, శోభన, శాశ్వత చటర్జీ, బ్రహ్మానందం, పశుపతి, అన్న బెన్, మళవిక నాయర్ తదితరులు
కెమెరా: జోర్జె స్టోజిలిజ్కోవిక్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు
సంగీతం: సంతోష్ నారాయణన్
నిర్మాత: సి. అశ్విని దత్
దర్శకత్వం: నాగ్ అశ్విన్
విడుదల: 27 జూన్ 2024

"మహానటి" తర్వాత దానికి పూర్తి భిన్నమైన కథ, అది కూడా తెలుగు సినిమా చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్టు ప్రాజెక్ట్ గా ప్రచారం పొందిన ఈ "కల్కి"ని ఎత్తుకున్నాడు నాగ్ అశ్విన్. 

ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరో, అతనికి తోడు బీసీ కాలం నాటి పాత్ర అయిన అశ్వథ్థామగా అమితాబ్ బచ్చన్, భవిష్యత్ పాత్ర యాస్కిన్ గా కమల్ హాసన్, గర్భిణి పాత్రలో దీపికా పడుకోణె.. వెరసి ట్రైలర్ సినీ వీక్షకులకి ఆసక్తి, అనుమానాలు రెండూ కలగజేసింది. ఆసక్తి దేనికంటే, ఇంత భారీ ప్రాజెక్ట్ తెర మీద ఎలా ఉంటుందో చూడాలని. అనుమానం దేనికంటే, ఈ భారీ ప్రయోగం జనానికి ఎక్కుతుందా అని! 

ఇంతకీ నేడు విడుదలయ్యి మొదటి ఆట అవ్వగానే అంచనాలు అందుకుందా, లేక అనుమానాలు పెంచిందా అనే విషయాన్ని పరిశీలిద్దాం.  Readmore!

కథ ప్రధానంగా మూడు ట్రాకులు. ఒకటి కాశీ, రెండు కాంప్లెక్స్, మూడు శంభల. 2898లో కాశీలో (భైరవ) తన హైటెక్ కార్ బుజ్జితో జీవిస్తుంటాడు. అతని కోరికల్లా ఎప్పటికైనా కాంప్లెక్స్ (యాస్కిన్ పాలకుడైన ఒక త్రిశంకు స్వర్గం) లో సెటిలైపోవాలని. దానికి గాను అతను ఒక మిలియన్ యూనిట్స్ సంపాదించవలసి ఉంటుంది. కాంప్లెక్స్ పాలకులు ఫలానా వారిని పట్టి తెమ్మని, తెచ్చిన వారికి బౌంటీ పేరుతో ఐదు వేలో.. పది వేలో యూనిట్స్ ఇస్తామని ప్రకటిస్తుంటారు. అలాంటి బౌంటీల కోసం వేచి చూస్తూ ఆ మిలియన్ యూనిట్లు సంపాదించుకుని కాంప్లెక్స్ కి వెళ్లిపోవడం భైరవ లక్ష్యం.

ఇదిలా ఉంటే కాంప్లెక్స్ లో బందీగా ఉన్న ఒక గర్భిణి సుమతి (దీపికా పడుకోణె). ఆమె అక్కడి నుంచి తప్పించుకుంటుంది. ఆమె కడుపులో పెరుగుతున్నది దైవాంశ అని తెలుసుకున్న ద్వాపరయుగం నాటి అశ్వథ్థామ (అమితాబ్) ఆమెను రక్షించే బాధ్యత తీసుకుంటాడు. ఎందుకంటే తన శాపవిమోచనం అయ్యేది ఆమె కనే బిడ్డతోనే. 

ఈ క్రమంలో సుమతిని పట్టుకుంటే ఐదు మిలియన్ల బౌంటీ ప్రకటిస్తారు కాంప్లెక్స్ పాలకులు. దాంతో ఆమెని పట్టుకుని కాంప్లెక్స్ కి అప్పగించే పనిలో పడతాడు భైరవ. 

ఆ కారణంగా భైరవకి, సుమతి రక్షకుడైన అశ్వథ్థామికి మధ్య హోరాహోరి పోరు. 

అక్కడి నుంచి కథ ఏమౌతుంది? శంభలతో కనెక్షనేంటి? ఇంతకీ భైరవ ఎవరు? కాంప్లెక్స్ ప్రభువు యాస్కిన్ (కమల్ హాసన్) ధ్యేయమేమిటి? వీటికి సమాధానాలు తెరపైన చూడాలి. 

ముందుగా ఇందులో ఉన్న డ్రా బ్యాక్స్ చెప్పేసుకుని తర్వాత మంచి విషయాలు ఏమున్నాయో చెప్పుకుందాం. 

ఈ కథని ఊహించడం కంటే ఆసక్తిగా నడపడం కష్టం. ఆ కష్టాన్ని దర్శకుడు మాత్రమే పడకుండా ప్రేక్షకులని కూడా పెట్టాడు. ముఖ్యంగా ప్రధమార్థం ఎక్కడా హత్తుకోదు. కాన్- ఫ్లిక్ట్ పాయింట్ ఎష్టాబ్లిష్ చేయడానికే చాలా సమయం పట్టేసింది. కథంతా అక్కడక్కడే తిరుగుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. 

ఫ్యూచర్ యాంబియెన్స్ తాలూకు గ్రాఫిక్స్ ద్వారా బాగానే క్రియేట్ చేసినా ఇంటర్వల్ వరకు కథ పాకాన పడకపోవడంతో నిట్టూరుస్తూ చూడాల్సి వస్తుంది. అంతవరకు భైరవ, అతని జేంస్ బాండ్ తరహా కారైన బుజ్జి, మార్వెల్ తరహా ఫైట్లు, చూడగలిగే బాల్యహృదయం ఉన్నవాళ్ళకి తప్ప ఇతర ప్రేక్షకులకి పెద్దగా ఎక్కదు. 

దీపికా పడుకోణె ట్రాక్ అంతా ఆ మధ్యన సమంత హీరోయిన్ గా వచ్చిన "యశోద" ని గుర్తు చేసేదిలా ఉంటుంది. అక్కడక్కడ నాగ్ అశ్విన్ తీసిన "ఎక్స్ లైఫ్" అనే వెబ్ మూవీని గుర్తుచేసే సన్నివేశాలు కూడా ఉన్నాయి. అలా అన్నీ ఎక్కడో చూసేసిన ఫీలింగ్ తో డెజావూలా అనిపిస్తుంది తప్ప ఫ్రెష్ ఫీలింగ్ రాదు. 

"చాలా ఊహించాం.. ఇదేంటి ఇలా ఉంది" అని ప్రేక్షకులు మనసులో అనుకుంటూ ఉండగానే, వాళ్ల మనోభావానికి శ్రుతి కలుపుతున్నట్టుగా "నీ గురించి చాలా బిల్డప్ ఇచ్చాను.. లే.." అనే డైలాగ్ వినిపిస్తుంది. 

కథని ఎక్కడా ఎమోషనల్ గా నడపలేకపోయాడు దర్శకుడు. రాజమౌళి సినిమాల్లో ఉన్నట్టు పీక్ మొమెంట్స్ లేవు. స్క్రీన్ ప్లే కూడా ఫ్లాట్ గా సాగుతుంది. 

అయితే ఈ కంప్లైంట్లన్నీ ప్రముఖంగా ఫస్టాఫ్ లోనే ఎక్కువగా ఉంటాయి. 

ద్వితీయార్థానికి వచ్చే సరికి కథ గాడిలో పడడం వల్ల కొంత, థీం అలవాటవడం వల్ల ఇంకొంత.. వెరసి బోరింగ్ మొమెంట్స్ తగ్గిపోయి ఎంగేజ్ అవ్వడం మొదలుపెడతాం.

ప్రభాస్ పాత్ర ఎక్కువగా యాక్షన్ సన్నివేశాలకే సరిపోయింది. అతను హీరో అయితే పక్కన హీరోయిన్ ఉండాలి కదా అని సగటు భారతీయ ప్రేక్షకుడు అనుకుంటాడు. కానీ ఇక్కడ హీరోయిన్ లేదు. ఏదో ఒక పాట కోసం అలా వచ్చి వెళ్లిపోయే దిశా పటాని ఉందంతే. ఆమెని హీరోయిన్ అని అనలేం. 

సినిమాని ఎక్కువగా డామినేట్ చేసింది మాత్రం అమితాబ్ బచ్చనే. ఎనిమిదడుగుల అశ్వథ్థామగా నానా రకాలా గ్రాఫిక్స్ ఫైట్లు చేసాడాయన. ద్వాపరయుగం మనుషుల యావరేజ్ ఎత్తు 8 అడుగులని ఒక థియరీ చలామణీలో ఉంది కనుక, ఆరడుగుల అమితాబ్ ఎనిమిది అడుగుల ఎత్తులో కనిపించడం ఓకే!

దీపికా పడుకోణె ది పూర్తిగా సీరియస్ పాత్ర. హై బడ్జెట్ సినిమాకి స్టార్ డం ఉండాలి కాబట్టి ఆమెని పెట్టుకోవడం తప్ప నటనా ప్రతిభ చూపించడానికైతే పెద్దగా ఏమీ లేదు ఆ పాత్రకి.

యాస్కిన్ గా కమల్ హాసన్ ది అతిథి పాత్రలా ఉంది. ఒకే లొకేషన్లో 3 సార్లు కనిపిస్తాడంతే.  

శంభల దేశపు మరియం గా శోభన ఓకే. ఫస్టాఫులో కాసేపు రాజేంద్రప్రసాద్ కనిపిస్తాడు. వీరన్ గా పశుపతి, మానస్ గా శాశ్వత చటర్జీ ఆయా పాత్రలకి సరిపోయారు. 

కృష్ణుడు పాత్ర ధారి మొహం కనపడదు. డబ్బింగ్ మాత్రం ఎవరో హిందీ నటుడు చెప్పినట్టుగా కృతకంగా ఉంది. 

ఇక ఇందులో కేమియోలుగా చాలామంది నటులు కనిపించారు. అర్జునుడిగా విజయ్ దేవరకొండ ఒక సర్ప్రైజ్. మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్, రాం గోపాల్ వర్మ, రాజమౌళి ఇలా చాలామంది కేమియోలు ఇలా వచ్చి అలా మాయమౌతుంటారు. 

అయితే సినిమా మొత్తంలో ఒక్క ప్రభాస్ తప్ప అన్నీ సీరియస్ పాత్రలే. 

టెక్నికల్ గా గ్రాఫిక్స్ గురించే ఎక్కువగా చెప్పుకోవాలి. భవిష్యత్తులో భూమి ఉపరితలమంతా ఎడారైపోతుందని ఆదిత్య369లో సింగీతం శ్రీనివాసరావు చూపిన దాన్నే ఇందులో ఫాలో అయిపోయారు. ఆయన ఈ చిత్రానికి మెంటార్ కావడం ఒక విశేషం. 

ఈ సినిమాకి ప్రధానమైన అతి పెద్ద మైనస్ సంగీతం. పాటలు పరమ బోరింగ్ గా ఉంటే, బ్యాక్ గ్రౌండ్ ఎక్కడా ఉండాల్సిన రీతిలో లేదు. ఒక్కటంటే ఒక్క గూజ్బంప్స్ మొమెంట్ కూడా తెప్పించలేకపోయింది సంతోష్ నారాయణన్ సంగీతం. ఈ స్థాయి సినిమాకి ఎలా ఉండకూడదో అలా ఉంది. ఈ క్రాఫ్ట్ కనుక సరిగ్గా కుదిరి ఉంటే ఈ చిత్రం రేంజ్ మరో స్థాయికి వెళ్లుండేది. 

అయితే ఈ కథలో మెచ్చుకోదగ్గ అంశం మాత్రం మహాభారతాన్ని కల్కి అవతారఘట్టంతో ఆసక్తిగా ముడిపెట్టగలగడం. సినిమా అంతా ఎలా అనిపించినా క్లైమాక్స్ ఘట్టం మాత్రం చాలా ఆసక్తిగా అనిపిస్తుంది. సీక్వెల్ చూడమని ఉసిగొల్పేలా ఉంది. 

చివర్లో కమల్ హాసన్ పాత్ర రివీల్ అయిన విధానం, ప్రభాస్ పాత్రకి కి మహాభారతంతో ఉన్న లింక్ గురించి చెప్పిన తీరు ఇంటెరెస్టింగ్ గా ఉన్నాయి. తర్వాత కథ ఎలా కొనసాగుంతుందా అనే ఆలోచనలో పెట్టింది కూడా. 

కురుక్షేత్రయుద్ధంతో మొదలై అక్కడి నుంచి 6000 సంవత్సరాల తర్వాత ఘట్టంతో కొనసాగే ఈ కథ తెలుగు తెర మీద గీసిన అత్యంత ఖరీదైన చిత్రం. ఈ సినిమా పెద్ద తెర మీద తప్ప ఓటీటీలో చూస్తే విజువల్ గా ఏమీ అంత గొప్పగా అనిపించకపోవచ్చు. కథనంగా అంచనాలు పూర్తిగా అందుకోకపోయినా, కేవలం క్లైమాక్స్ ఘట్టంతో సీక్వెల్ మీద ఆసక్తి కలిగించడంలో ఉత్తీర్ణత సాధించింది. ఈ చిత్రంలో శంభల ప్రజలు "రేపటి కోసం" అని నినదిస్తూ, కల్కి ఆగమనం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అలాగే  క్లైమాక్స్ ఘట్టంతో  ప్రేక్షకులు "సీక్వెల్ కోసం" అంటూ వెయిట్ చేసేలా చేసాడు దర్శకుడు. 

బాటం లైన్: సీక్వెల్ కోసం

Show comments

Related Stories :