కులాలవారీగా చీలుతున్న ఆంధ్రప్రదేశ్‌.!

కులాల కుంపట్లు రాజకీయ నాయకులకే పరిమితం. రాజకీయ పార్టీలు ఎన్నికల వేళ కులాల పేరుతో నిలువునా ప్రజల్ని చీల్చాలని ప్రయత్నించడం మామూలే. కానీ, మీడియా కూడా అదే పని చేస్తే ఎలా.? 

ఫలానా కులం ఫలానా రాజకీయ పార్టీకి అండగా నిలబడటం.. అనేది రాజకీయాల్లో మామూలే. అయితే, అది పూర్తిస్థాయిలో కాదు. 'మెజార్టీ' అనే పదాన్ని వినియోగించాల్సి వుంటుంది. అలా, ఓ కులం ఓ పార్టీ వైపు మొగ్గు చూపడానికీ చాలా కారణాలే వుంటాయి. ఉదాహరణకు, 2014 ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం, తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచింది. దానికి కారణం అందరికీ తెల్సిందే, తాము అధికారంలోకి వస్తే, కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పిస్తామని టీడీపీ ప్రకటించడమే ఆ ముఖ్య కారణం. 

ఇక, వర్గీకరణ పేరుతో మాదిక సామాజిక వర్గాన్ని రాజకీయ పార్టీలు వంచించిన తీరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇతర కులాల విషయంలోనూ ఇలాంటి పొలిటికల్‌ జిమ్మిక్కులు చాలానే జరుగుతుంటాయి. చాలా సందర్భాల్లో ఏ సామాజిక వర్గమైనాసరే, రాజకీయ పార్టీల్ని లైట్‌ తీసుకోవడమూ మామూలే. ఎన్నికల వేళ, ఆయా సామాజిక వర్గాల ఓటు బ్యాంకు ఎటు వైపు మళ్ళుతుంది.? అన్న అంచనాలు వేయడం కొత్తేమీ కాదు. 

కానీ, అసలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వాతావరణమే లేదు. కానీ, సర్వేలు జరుగుతున్నాయట. ఆ సర్వేల్లో ఏం తేలుతుందోగానీ, రకరకాల జిమ్మిక్కులైతే తెరపైకొస్తున్నాయి. 'కులాల వారీగా చీలుతున్న ఆంధ్రప్రదేశ్‌లో ఏ కులం ఎటు వైపు..' అంటూ ఓ ఛానల్‌ రచ్చ రచ్చ చేసేస్తోంది. పైత్యానికి పరాకాష్ట ఇది. కులాల వారీగా రాష్ట్రమెందుకు చీలిపోతుంది.? ప్రజల ఆలోచనల్లో వైవిధ్యం వుండొచ్చుగాక. అంతమాత్రాన అది చీలిక అనుకోవడం, హీనాతి హీనం. 

'రిపోర్ట్‌ చెయ్యడాలు, డిసైడ్‌ చెయ్యడాలు..' ఇంత ఛండాలమా.? అంటే, ఛండాలానికే కేరాఫ్‌ అడ్రస్‌ సదరు మీడియా సంస్థ. సో, ఆ సంస్థ నుంచి వచ్చే సర్వేలు, వాటి చుట్టూ కథనాలు ఇంతకన్నా గొప్పగా వుంటాయని ఎలా అనుకోగలం.? ఫలానా పార్టీకి కొమ్ముకాస్తే, ఆ పార్టీకి అనుకూలంగా చెప్పుకోవచ్చుగాక, కానీ కులాల వారీగా చీలిపోవడం అంటే, సమాజాన్ని నిలువునా చీల్చేయాలన్న కుట్ర మాత్రమే.

Show comments