ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుగారి పుత్రరత్నం.. పైగా, మంత్రిగారైన నారా లోకేష్ 'బాబు' గారి పరిజ్ఞానం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. వర్ధంతిని జయంతి అంటారు, జయంతిని వర్ధంతి అనేస్తారు.. ఇలాంటి ఫన్నీ థింగ్స్ చాలానే చేస్తుంటారు.
విదేశాల్లో ఉన్నత చదువులు, అన్నిటికీ మించి గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ చంద్రబాబు పుత్రరత్నం అనే 'నిప్పు'లాంటి ఘనత.. అన్నీ వున్నా ఏం లాభం.? 'పప్పు' అన్న వెటకారాలు ఆయన్ని వెంటాడతాయ్.! అవును మరి, ఆయన పరిజ్ఞానం అంత గొప్పగా వుంటుంది.
'సదావర్తి' భూముల వ్యవహారానికి సంబంధించి చంద్రబాబు సర్కార్ 'పప్పు'లో కాలేసిన మాట వాస్తవం. హైకోర్టు మొట్టికాయలేసింది కూడా. ప్రభుత్వం ఖరారు చేసిన ధర కంటే, ఎక్కువ మొత్తం చెల్లిస్తే ఆ భూములు అప్పగించడానికి సిద్ధమని న్యాయస్థానం చెప్పిందంటే, దానర్థమేంటి.? ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలు నిజమనే కదా.!
అప్పనంగా అయినవారికి సదావర్తి భూముల్ని చంద్రబాబు సర్కార్ కట్టబెట్టేందుకు ప్రయత్నించింది.. దాన్ని ప్రతిపక్షం ప్రశ్నించింది. ప్రతిపక్షానికి చెందిన ఓ ఎమ్మెల్యే, అధికార పార్టీ భూ దందాపై కోర్టును ఆశ్రయించింది. అది ప్రతిపక్షం బాధ్యత. న్యాయస్థానం, పిటిషన్ దాఖలు చేసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేకి 'బంపర్ ఆఫర్' ఇచ్చిందంటే, అధికార పక్షానికి మొట్టికాయలేసినట్టే.
ఈ పరిస్థితుల్లో అధికార పక్షమే స్వచ్ఛందంగా ముందుకొచ్చి, సదావర్తి భూముల ధారాదత్తంపై వెనక్కి తగ్గాల్సి వుంది. అది మానేసి, నారా లోకేష్ ప్రతిపక్షాన్ని బెదిరించేందుకు యత్నిస్తున్నారు. 'మీ దగ్గర అన్ని డబ్బులెక్కడివి.? బినామీలతో కొనిపిస్తే, ఐటీ దాడులు చేయిస్తాం..' అంటూ హెచ్చరించేశారు మంత్రి నారా లోకేష్. 'నాన్సెన్స్'కే పరాకాష్ట ఇది.
తన స్థాయిని మర్చిపోయి లోకేష్ వ్యవహరిస్తున్నారనీ, అసలంటూ పరిజ్ఞానం లేకుండానే ఆయన పెచ్చిపోతున్నారనీ ఆయన వ్యాఖ్యల్ని చేస్తే ఎవరికైనా అర్థమవుతుంది. మొత్తమ్మీద, ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి, గెలిచేంత ధైర్యం లేని వ్యక్తి నుంచి ఇంతకన్నా గొప్ప పరిజ్ఞానాన్ని ఆశించలేం.