రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్టు చిన్న హింట్ ఇచ్చాడో లేదో అప్పుడే ఆయనపై విమర్శలు మొదలయ్యాయి. ఎవరినైనా విమర్శించగల హక్కు, అధికారం ఉందనే భావించే బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ఈసారి రజినీకాంత్ పై పడ్డాడు. రజినీకాంత్ మొద్దబ్బాయ్. ఆయనకు చదువు లేదు. నిరక్షరాస్యుడిని తమిళనాడు ప్రజలు ముఖ్యమంత్రిగా ఒప్పుకోరని తనే తేల్చిపారేశాడు. రజినీకాంత్ మందబుద్ధి వ్యక్తి అని, రాజకీయాలు, సమాజం పట్ల అవగాహన లేదన్నాడు. ఒకవేళ రజినీకాంత్ రాజకీయాల్లోకి వచ్చి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కచ్చితంగా వ్యతిరేకిస్తానంటున్నాడు. సుబ్రమణ్యం వ్యాఖ్యల నేపధ్యంలో అసలు రజినీకాంత్ ఏం చదువుకున్నాడనేది ఆసక్తి మారింది.
వాస్తవానికి సూపర్స్టార్ రజినీకి అధికారికంగా ఎలాంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ లేవనే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన ప్రాధమిక పాఠశాల దశలోనే స్కూలు మానేశాడు. రజినీకాంత్ పూర్వికులది ప్రస్తుత మహారాష్ట్రలోని పుణె జిల్లా. ఆయితే ఆయన తండ్రి రామోజీరావ్ గైక్వాడ్ బెంగుళూరుకు వలస వచ్చి అక్కడ ఒక సాదాసీదా కానిస్టేబుల్గా పనిచేశాడు. తల్లి రమాబాయి. 1950 డిసెంబర్ 12న రజినీకాంత్ బెంగళూరులోనే జన్మించారు. అప్పుడు బెంగళూరు మద్రాసు స్టేట్లో ఉండేది. రజినీ ఐదేళ్ల వయస్సులో ఆయన తల్లి మరణించింది. బాల్యంలో ఆచార్య పాఠశాల అనే స్కూళ్లో చేరిన రజినీ కొద్ది రోజులకే స్కూలు వదిలేశాడు.
ఆ తరవాత రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో నడిచే బాలల సంఘంలో చేరాడు. ఇది ఆధ్యాత్మిక విషయాలు నేర్పించే సంఘం. కొన్నాళ్లకు అందులో నుంచి బయటకొచ్చి జీవనోపాధి కోసం కూలీ పనులు చేశాడు. అయితే బెంగళూరు ట్రాన్స్పోర్ట్ కార్పోరేషన్లో కండక్టర్గా జాయిన్ అయ్యాక రజినీ దశ తిరిగిపోయింది. బాలచందర్ బస్సులో ప్రయాణం చేస్తూ రజినీని చూడడం, ఆయన స్టైల్ నచ్చి చెన్నై యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వాలని సూచించడం ఆ తరవాత అపూర్వ రాగంగల్ చిత్రంలో అవకాశం ఇవ్వడం అదంతా తెలిసిన కధే. అయితే రజినీకాంత్ చదువుకున్న ఆచార్య పాఠశాల బెంగళూరులో ఇప్పటికీ మంచి పాఠశాలగా కొనసాగుతోంది.