'పవన్‌కళ్యాణ్‌ ఈజ్‌ మై ఫ్రెండ్‌..'

టీడీపీ నేత, ఎంపీ రాయపాటి సాంబశివరావు మీడియా ముందుకొచ్చారు. రారా మరి, పవన్‌కళ్యాణ్‌ ఆయన మీద ఘాటైన వ్యాఖ్యలు చేశాక. 

'రాయపాటిగారు స్పెషల్‌ స్టేటస్‌ కోసం పోరాటం చెయ్యరు, చేసేవారిని చెయ్యనివ్వరు.. పైగా కష్టపడే రైతుల పచ్చని పొలాల్లో మీ పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు లాభాల కోసం మట్టిని డంప్‌ చేయిస్తారు.. 

'పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు కోసం ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టకండి, పెద్దలు 'రాయపాటి'గారూ ఒకసారి ఆలోచించండి' 

'ఇలాంటి వ్యాపార ధోరణి రాజకీయాలతోనే మీరు తెలంగాణ యువతకి కోపం తెప్పించి, ఆంధ్రోళ్ళు దోచుకుంటున్నారు అన్న అపవాదు మొత్తం జాతికే తీసుకొచ్చారు' 

'మీ దురాశకి, డబ్బు, పదవీ వ్యామోహానికి భావి తరాల భవిష్యత్తుని పాడు చేసే హక్కు మీకు లేదు' 

ఇలా సాగింది పవన్‌కళ్యాణ్‌ ట్వీట్ల ప్రవాహం రాయపాటి సాంబశివరావు మీద. అంతే, ఆయన మీడియా ముందుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కి పోలవరం ప్రాజెక్టు జీవనాడి అనీ, ప్రత్యేక హోదా ఇవ్వలేని పరిస్థితుల్లో కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిందనీ, ప్రత్యేక హోదాని పవన్‌కళ్యాణ్‌ సాధిస్తే ఆయన గొప్పతనాన్ని ఒప్పుకుంటాననీ సెలవిచ్చారు. అంతేనా, 'పవన్‌కళ్యాణ్‌ ఈజ్‌ మై ఫ్రెండ్‌' అంటూ రాయపాటి నవ్వేశారు. అక్కడ, పవన్‌కళ్యాణ్‌ ఘాటైన విమర్శలు చేస్తే, రాయపాటికి నవ్వెలా వచ్చిందట.? ఇది కదా, రాజకీయమంటే.! 

Show comments