బాలీవుడ్ సినిమా 'రబ్తా', తెలుగు సినిమా 'మగధీర'కి మక్కీకి మక్కీ కాపీ అనే విమర్శలు విన్పిస్తోన్న విషయం విదితమే. సోషల్ మీడియాలో ఈ విషయమై పెద్ద రచ్చే జరిగింది. 'రబ్తా' ప్రోమోస్లో అచ్చంగా 'మగధీర'ని తలపించే సీన్స్ కన్పించడంతో, 'మగధీర' టీమ్ కూడా అలర్ట్ అయ్యింది. 'రబ్తా' టీమ్ తమ 'మగధీర'ను అక్రమంగా కాపీ కొట్టేసిందంటూ 'మగధీర' టీమ్ కోర్టును ఆశ్రయించింది.
అయితే, ఈ కేసులో 'మగధీర'పై 'రాబ్తా' టీమ్ విజయం సాధించింది. ఎక్కడా, 'రాబ్తా' సినిమా కోసం 'మగధీ'లోని సీన్స్ కాపీ కొట్టలేదని, 'రాబ్తా' టీమ్ కోర్టుకి విన్నవించింది. హీరో, హీరోయిన్ల క్యారెక్టరైజేషన్ దగ్గర్నుంచి, విలన్ క్యారెక్టర్ దాకా ఎందులోనూ పోలిక లేదనీ, 'మగధీర' బ్యాక్డ్రాప్తో, 'రాబ్తా' బ్యాక్డ్రాప్కి సంబంధమే లేదని సుదీర్ఘంగా 'రాబ్తా' టీమ్ తరఫు న్యాయవాది వాదించడంతో, 'మగధీర' టీమ్ వాదనలు చెల్లలేదు.
'రాబ్తా' టీమ్ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించడంతో, ఈ కేసులో 'మగధీర' టీమ్ వెనుకడుగు వేయాల్సి వచ్చిందట. మొత్తమ్మీద, వివాదం సద్దుమణిగిందనీ, న్యాయస్థానంలో సమర్థవంతంగా వాదనలు విన్పించగలిగామనీ, సినిమా విడుదలకు అడ్డంకులు ఏమీ లేవనీ, సినిమా అనుకున్నట్లుగానే విడుదలై ఘనవిజయం సాధిస్తుందనీ 'రాబ్తా' చిత్ర దర్శక నిర్మాతలు చెబుతున్నారు. సుశాంత్ సింగ్ రాజ్పుట్, కృతి సనన్ 'రాబ్తా' సినిమాలో జంటగా నటించారు. జూన్ 9న అంటే రేపే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.